రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో మొత్తం 10 పని దినాలు ఉండనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు, ఎంసీఐ బిల్లు, కంపెనీ లా సవరణ చట్టాలను ఆమోదింపజేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్పై కనీసం 3 నుంచి 4 రోజులు చర్చా సమయం కేటాయించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఐదేళ్ల కాలపరిమితిలో 6 పూర్తిస్థాయి బడ్జెట్లు ఎలా ప్రవేశపెడతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందుగా జరిగే చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో మోడీ సర్కారు ఈ సారి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. రైతు బంధు తరహాలో కేంద్రం రైతులకు ఏటా 10వేల రూపాయల ఆర్థిక ప్యాకేజీని అందజేసే పథకాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. 16వ లోక్సభకు ఇవి చివరి సమావేశాలు కావడంతో ఆర్థిక సమీక్ష నివేదిక ప్రవేశపెట్టే అవకాశం లేదని సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశంలో ఆర్థిక సమీక్ష నివేదిక ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa