రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మేడాకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లికార్జునరెడ్డితో పాటూ ముఖ్యమైన అనుచరులు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. చేరిక సందర్భంగా రాజంపేట నుంచి మేడా అనుచరులు భారీగా తరలివచ్చారు.
వైసీపీలో చేరడం సంతోషనిచ్చిందని.. తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు మేడా మల్లికార్జునరెడ్డి. కడప జిల్లాలో వైసీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని.. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. మేడా మల్లికార్జున్ రెడ్డిని ఈ నెల 22న టీడీపీ సస్పెండ్ చేసింది. అమరావతిలో జరిగిన రాజంపేట కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టీడీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో పాటు వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదే రోజు సాయంత్రం మేడా వైఎస్ జగన్ను కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్తో భేటీ తర్వాత మాట్లాడిన మేడా.. చంద్రబాబుపై ఫైరయ్యారు. చంద్రబాబు గంజాయి వనం నుంచి.. వైఎస్ జగన్ తులసివనంలోకి వచ్చినట్టుందన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీలో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేక బయటకు వచ్చానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa