ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8వ వేతన సంఘం ఆలస్యం.. ఎందుకంటే?

business |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2025, 09:59 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూసి నిరాశకు గురయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పే కమిషన్‌కి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై కీలక ప్రకటన చేస్తారని భావించారు. కానీ, బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఊసేఎత్తలేదు. దీంతో సుమారు 1.20 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. బడ్జెట్‌కు ముందే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించడంతో బడ్జెట్లో ప్రకటన చేస్తారని భారీ అంచనాలు ఉండేవి. కానీ, అలా జరగలేదు. దీంతో కొత్త పే కమిషన్ అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


బడ్జెట్‌కి ముందే 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోదీ కేబినెట్ త్వరలోనే ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్‌తో ప్యానల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ ప్యానల్ వచ్చే ఏడాది తొలినాళ్లలోనే నివేదిక సమర్పించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం ఈ ఏడాది డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. దీంతో జనవరి 1, 2026 నుంచే కొత్త వేతన సంఘం అమలు చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోడవడం, కనీసం రోడ్ మ్యాప్ కూడా ప్రకటించకపోవడంపై ఉద్యోగులు అయోమయంలో పడ్డారు.


 ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో ఆ తర్వాత బడ్జెట్ 2026-27లో ఉంటాయని తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల పెరిగుతాయి కాబట్టి బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈసారి ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు చేయలేదని తెలుస్తోంది. 8వ వేతన సంఘం కోసం ఏర్పటయ్యే ప్యానల్ రిపోర్ట్ తయారు చేసేందుకు కనీసం ఏడాది తీసుకునే అవకాశం ఉంది. దీంతో అప్పటి వ్యయ అంచనాల ప్రకారం ఆ తర్వాత బడ్జెట్‌లో కేటాయింపులు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


7వ వేతన సంఘం అమలు కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఏడాదికిపైగా సమయం తీసుకుంది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ప్యానల్ మార్చి, 2025 నాటికి ఏర్పాటు చేసినా నివేదిక సమర్పించేందుకు కనీసం ఏడాది కాలం పడుతుందని అంచనా వేయవచ్చు. దీంతో కమిషన్ రిపోర్ట్ మార్చి, 2026 తర్వాతే రావచ్చని తెలుస్తోంది. అ తర్వాతే ఉద్యోగులు జీతాల పెంపుపై నిర్ణయం వెలువడుతుంది. దీంతో జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం అమలు దాదాపుగా ఉండకపోవచ్చని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com