చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళ పట్ల అమానుష ప్రవర్తనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధిత మహిళను పరామర్శించిన చంద్రబాబు..రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అప్పు తీర్చలేదనే కారణంతో కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి ఆమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని మహిళకు ఇలా జరిగితే.. రాష్ట్రంలో మహిళల శాంతిభద్రతల సంగతేంటంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం కుప్పం ఘటనపై స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు బాధిత మహిళ శిరీషను ఫోన్లో పరామర్శించారు.
ఘటన వివరాలను శిరీషను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. అప్పు ఇచ్చిన వారి నుంచి గతంలో ఎప్పుడైనా వేధింపులు ఎదురయ్యాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గతంలోనూ పలుసార్లు.. వారు తమని ఇబ్బంది పెట్టారనే విషయాన్ని శిరీష.. చంద్రబాబుకు వివరించారు. తాజాగా జరిగిన పరిణామంతో పిల్లలకు, తనకు భయం కలుగుతోందన్నారు. బాధితురాలిని ఓదార్చిన చంద్రబాబు.. ఇలాంటి ఘటనలను అసలు సహించేది లేదన్నారు. అమానుషంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిల్లలను బాగా చదివించాలని శిరీషకు చెప్పిన చంద్రబాబు.. వారి ఆర్థిక పరిస్థితులు, రుణభారాన్ని తెలుసుకుని.. అప్పటికప్పుడు శిరీష కుటుంబానికి చంద్రబాబు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.శిరీష ముగ్గురు పిల్లలను చదివించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. శిరీషపై దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని, ఆ కుటుంబానికి అండగా ఉండి, సాయం అందేలా చూడాలని చంద్రబాబు స్థానిక అధికారులను ఆదేశించారు.
మరోవైపు నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప, మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద 80 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువకావటంతో తిమ్మరాయప్ప ఊరు వదిలి వెళ్లిపోయాడు. దీంతో తిమ్మరాయప్ప భార్య శిరీషపై అప్పు చెల్లించాలంటూ మునికన్నప్ప, అతని భార్య, కొడుకు, కోడలు దాడి చేశారు. శిరీషను ఓ చెట్టుకు కట్టేసి దాడి చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని శిరీషను విడిపించారు. శిరీష ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa