అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం బీమా క్లెయిమ్లు 475 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4 వేల కోట్లకు చేరవచ్చని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ దిగ్గజం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీఇన్సూరెన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ వెల్లడించారు. విమానం విలువ కంటే 2.5 రెట్లు ఎక్కువగా చెల్లింపులు ఉంటాయని ఆయన అంచనా వేశారు. విమానం బీమాతో పాటు.. ప్రయాణికులు కొనుగోలు చేసిన వ్యక్తిగత ప్రమాద బీమాలు, క్రెడిట్ కార్డ్ బీమాలు, ఓవర్సీస్ ట్రావెల్ బీమాలు, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాలు కూడా ఈ మొత్తం క్లెయిమ్లలో భాగంగా ఉంటాయని తెలిపారు.
తాము వేసిన అంచనాల ప్రకారం.. విమాన నష్టం సుమారు 125 మిలియన్ డాలర్లు సుమారు రూ. వెయ్యి కోట్లు ఉంటుందని రామస్వామి నారాయణన్ తెలిపారు. ప్రయాణికుల బాధ్యత, థర్డ్ పార్టీ బాధ్యత, అమల్లో ఉన్న ఇతర వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్లు, ట్రావెల్ పాలసీల కారణంగా వచ్చే బాధ్యత క్లెయిమ్లు 350 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.3 వేల కోట్లు అవుతాయని రామస్వామి నారాయణన్ వెల్లడించారు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీఇన్సూరెన్స్ నేరుగా బీమా సంస్థ కానప్పటికీ.. పునర్బీమా ద్వారా ఎయిరిండియా విమానాలకు దాని బాధ్యత ఉంటుందని తెలిపారు. జాతీయ పునర్బీమా సంస్థగా.. దేశీయ నాన్ లైఫ్ బీమా కంపెనీలు స్వీకరించే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీ ఇన్సూరెన్స్ ప్రమాదంలో కొంత భాగాన్ని భరిస్తుంది.
ఎయిరిండియా కొనుగోలు చేసిన విమాన బీమాతో పాటు.. ప్రయాణికులు కొనుగోలు చేసిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల కింద వ్యక్తిగత ప్రమాద క్లెయిమ్లకు కూడా జీఐసీ రీ ఇన్సూరెన్స్ బాధ్యత వహిస్తుంది. అనేక సందర్భాల్లో ప్రయాణికులు క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించిన వ్యక్తిగత ప్రమాద బీమా కింద కూడా కవర్ అవుతాయి. చాలా భారతీయ క్రెడిట్ కార్డులు రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను అందిస్తాయి. ప్రీమియం కార్డులు సాధారణంగా రూ.1 కోటి కవరేజీని కలిగి ఉంటాయి. అయితే మిడ్ టైర్ కార్డులు రూ.20 లక్షల నుండి రూ.50 లక్షల వరకు అందిస్తాయి. విమాన టికెట్ క్రెడిట్ కార్డు ఉపయోగించి బుక్ చేసి నిర్దిష్ట సమయంలోపు క్లెయిమ్ దాఖలు చేయబడితే.. విమాన ప్రమాదంలో మరణించిన సందర్భంలో నామినీకి ఒకేసారి డబ్బులు చెల్లిస్తారు.
విదేశాల్లో మెడికల్ ఖర్చులు ఎక్కువగా ఉన్నందున.. చాలా మంది భారతీయులు ఓవర్సీస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేస్తారు. ఇందులో వ్యక్తిగత ప్రమాద కవరేజీ కూడా ఉంటుంది. బ్యాంకులు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాల కింద కూడా ప్రమాదవశాత్తు మరణ బీమాను అందిస్తాయి. ఇది మరణించిన సందర్భంలో రూ.2 లక్షలు చెల్లిస్తుంది. విమానం పునర్బీమాతో పాటు ప్రయాణికుల వ్యక్తిగత పాలసీలకు సంబంధించిన బాధ్యత కూడా జీఐసీ రీఇన్సూరెన్స్ కలిగి ఉంటుందని రామస్వామి నారాయణన్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa