ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రైల్వేస్టేషన్‌ లో ఏకంగా 14 ప్లాట్‌ఫాంలు..ఎయిర్‌పోర్టు రేంజులో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 07:32 PM

ఏపీలో పలు రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయ్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 70 వరకూ రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు కూడా మారనున్నాయి. విశాఖ రైల్వేస్టేషన్‌లో మరో ఆరు ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎనిమిది ప్లాట్‌ఫామ్‌లు ఉండగా.. వీటికి అదనంగా మరో ఆరు ప్లాట్ ఫామ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కు చేరనుంది. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విశాఖ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.


ఆంధ్రప్రదేశ్‌లోని మూడు అతిపెద్ద రైల్వేస్టేషన్లలో విశాఖ రైల్వేస్టేషన్ ఒకటి. అయితే రైల్వేస్టేషన్‌లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్లు ప్రయాణికుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 466 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్‌ను వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల సంఖ్య, రైళ్ల రాకపోకలకు అనుగుణంగా 14 ప్లాట్‌ఫామ్‌లను విస్తరించనున్నారు. తొలుత రెండు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలనుకోగా.. ఆ తర్వాత ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం ఆరు ప్లాట్ ఫామ్‌లు నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు.


విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. అలాగే గోపాలపట్నం విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రస్తుతం రెండు ట్రాకులు అందుబాటులో ఉండగా.. వీటికి అదనంగా మరో రెండు లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా ఇన్ని రోజులు విశాఖ రైల్వేస్టేషన్ రీడెవలప్‍మెంట్ ప్రాజెక్టులో జాప్యం జరిగింది. అయితే కోర్టు కేసు క్లియర్ కావటంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ రైల్వే బోర్డుకు పంపారు. అక్కడ నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు.


దేశంలోనే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే తొలి 20 రైల్వేస్టేషన్లలో విశాఖ రైల్వేస్టేషన్ కూడా ఉంది. సాధారణ రోజుల్లో నిత్యం 50 వేల నుంచి 60 వేలమంది వరకూ ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండగ రోజులలో అయితే ఈ సంఖ్య 75 వేల వరకూ ఉంటుంది. అభివృద్ధి పనులలో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్‌లో కొత్త ఎస్కలేటర్లు, ఎయిర్ కాన్‌కోర్స్, వెయిటింగ్ ఏరియా వంటివి నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa