ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగ రోజున విషాదం,.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 27, 2025, 08:11 PM

వినాయక చవితి పండగ సందర్భంగా.. కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో.. ఆడుకోవడానికి వెళ్లిన యువకులకు ఊహించని షాక్ తగిలింది. విద్యుత్ షాక్ తగిలి ఒక యువకుడు మృతి చెందగా.. మరో ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు.. పోల్‌ నిలబెడుతున్న ఆరుగురు యువకులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటన కాస్తా.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. దీంతో స్పందించిన పవన్.. సంతాపం తెలిపారు.


ఇక విద్యుత్ షాక్ తగిలిన ఘటనలో ఏడిద చరణ్ అనే 19 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా మారడంతో వారిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. మూలపేట గ్రామంలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వాలీబాల్ ఆడుకునేందుకు పోల్‌లు నిలబెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు.. దాని వల్ల ఏడిద చరణ్ అనే యువకుడు చనిపోయినట్లు తనకు తెలిసి చింతిస్తున్నట్లు చెప్పారు.


ఏడిద చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని భరోసా ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే ప్రమాదంలో మరో ఆరుగురు యువకులు గాయపడినట్లు అధికారులు చెప్పారని.. వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ అందించాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.


గాయపడిన వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. క్రీడా ప్రాంగణాల్లో కావచ్చు, పని ప్రదేశాల్లో కావచ్చు.. పోల్స్ వంటివి నిలబెట్టేటపుడు.. ఎత్తైన ప్రదేశాల్లో నిర్మాణాలు వంటివి చేపట్టినపుడు విద్యుత్ షాక్‌ తగలకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏ క్షణంలోనూ అశ్రద్ధ వహించవద్దని.. ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు ఎంతో వేదన కలుగుతుందని తెలిపారు. ఈ సూచనను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa