టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా రోజులుగా అశ్విన్ ఢిల్లీ జట్టులోకి వెళుతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం ఢిల్లీ జట్టులోకి అశ్విన్ చేరబోతున్నట్టు పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా బుధవారం తెలిపారు.
అశ్విన్ ఢిల్లీ జట్టుకు వెళుతుండడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. పంజాబ్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమీ లాంటి వారు ఉన్నా.. జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. గత కొన్ని సీజన్లుగా రాహుల్ పంజాబ్ జట్టు తరపునే ఆడడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. అధికారిక ప్రకటన రాకున్నా.. సహ యజమాని నెస్ వాడియా రాహుల్ నాయకత్వం వైపే మొగ్గుగా ఉన్నాడట.
గత రెండు సీజన్లకు పంజాబ్కు నాయకత్వం వహించిన అశ్విన్ను బదిలీ చేయాలని నిర్ణయించుకున్న జట్టు యాజమాన్యం.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో అనిల్ కుంబ్లే కలువడంతో నిర్ణయాన్ని విరమించుకుంది. అయితే అశ్విన్కు బదులుగా ఇద్దరు యువ ఆటగాళ్లను ఢిల్లీ నుంచి తీసుకునేందుకు పంజాబ్ గతంలోనే ఒప్పందం కుదర్చుకుకుంది. దీంతో తాజాగా అశ్విన్ బదిలీపై పంపాలని పంజాబ్ నిర్ణయించుకుంది.
2018లో కెప్టెన్గా పంజాబ్ జట్టు పగ్గాలు అందుకున్న అశ్విన్.. 2019 సీజన్లో 14 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక కెప్టెన్గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. గత సీజన్లో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో నిలిచింది. మాన్కడింగ్ లాంటి వివాదంలో కూడా ఇరుక్కున్నాడు. దీంతో అశ్విన్ను తప్పించి మరో ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించాలని పంజాబ్ ఫ్రాంఛైజీ గత రెండు మూడు నెలలుగా కసరత్తులు చేసింది. చివరకు అశ్విన్కు వదులుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa