కింగ్స్టన్: వెస్టిండీస్తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఛేజింగ్ వీరుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అజేయ శతకం(111 నాటౌట్: 115బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టుకు విజయాన్ని అందించాడు. తద్వారా విండీస్పై వన్డే సిరీస్ను 3-1తో భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ సమం చేయాలని భావించిన విండీస్ ఆశలకు కోహ్లి, దినేష్ కార్తీక్ (52 బంతుల్లో 50 నాటౌట్) గండికొట్టారు. ఈ వన్డేలో సెంచరీతో కోహ్లి అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లికిది 28వ శతకం కాగా, ఛేజింగ్లో 18వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ ఛేజింగ్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(17) పేరిట ఉంది. విండీస్పై చివరివన్డేలో చేసిన సెంచరీతో కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు.
ఛేజింగ్లో 17 శతకాలు నమోదు చేయడానికి సచిన్ 232 ఇన్నింగ్స్లు ఆడగా, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ 102 ఇన్నింగ్స్ల్లోనే 18 సెంచరీలు బాదాడు. మూడో స్థానంలో శ్రీలంక వెటరన్ క్రికెటర్ దిల్షాన్ (116 ఇన్నింగ్స్ల్లో 11 శతకాలు), క్రిస్ గేల్(139 ఇన్నింగ్స్ల్లో 11 శతకాలు) ఉన్నారు. మరోవైపు మహ్మద్ షమీ(4/48), ఉమేశ్ యాదవ్(3/53) రాణించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షెయ్ హోప్(51), కైల్ హోఫ్(46) రాణించారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన భారత్ 36.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. తద్వారా వన్డే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. కెప్టెన్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఓపెనర్ అజింక్య రహానే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa