ఉత్తరాఖండ్ ఘటన మరవకముందే... హిమాచల్ప్రదేశ్లోనూ అలాంటి విషాదమే చోటుచేసుకుంది. ట్రెక్కింగ్కి వెళ్లిన పర్వతారోహకులు మంచు తుఫానులో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారని ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) అధికారులు వెల్లడించారు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. ట్రెక్కర్ల బృందంలోని 13 మందిలో 12 మంది మహారాష్ట్రకు చెందినవారు కాగా, ఒకరు మాత్రం పశ్చిమబెంగాల్కి చెందినవారని అధికారులు పేర్కొన్నారు. ఈ పదమూడు మందిలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. వీరంతా అక్టోబర్ 17న కిన్నౌర్ జిల్లాలోని రోహ్రు నుండి బురువా గ్రామానికి తమ యాత్రను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా... బురువా కందా ఎగువ ప్రాంతంలో వారంతా చిక్కుకుపోయారు. ఈ మేరకు సమాచారమందుకున్న ఐటిబిపి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 15000 అడుగుల వద్ద మూడు మృతదేహాలు పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతదేహాలను వెలికితీయడానికి ఐటిబిపి బృందం సోమవారం అక్కడికి చేరుకోకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, చనిపోయిన ముగ్గురు రాజేంద్ర పాఠక్, అశోక్ భలేరావు, దీపక్ రావుగా అధికారులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa