మద్యం అలవాటు నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అతడి క్షణికావేశ నిర్ణయానికి ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలు.. తునికి చెందిన మదీనా కాశీవిశ్వనాథంకు భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన చిట్రా అమలకు పదేళ్ల కిందట వివాహమయ్యింది. కాశీవిశ్వనాథం తునిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అయితే, మద్యం అలవాడు ఉన్న కాశీవిశ్వనాథంను మంచిగా మారుతాడనే ఉద్దేశంతో అమల తండ్రి చిట్రా ఆనందరావు.. చెరుకుపల్లి తీసుకొచ్చాడు. ఇక్కడ కుటుంబంతో జీవిస్తున్నాడు. అయితే ఇద్దరు పిల్లలు తగరపువలసలో డ్యాన్సు నేర్చుకుంటుండంతో వారిని రోజూ తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. శుక్రవారం డిసెంబరు 31 కావడంతో కాశీవిశ్వనాథం గతంలో కంటే కాస్త ఎక్కువగా మద్యం తాగాడు. అయితే ఎప్పటిలాగే పిల్లలను డ్యాన్సు స్కూల్కు తీసుకెళ్తానని భార్య అమలతో చెప్పడంతో, మద్యం తాగి ఉన్నావు వద్దని భార్య అనడంతో మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో పాతచెరుకుపల్లి సమీపానికి వెళ్లి పురుగు మందు తాగి, అనంతరం సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోధిస్తున్నారు. మృతుడి తండ్రి మదీనా సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యు.మహేష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa