మాస్క్లను ఎక్కువసేపు ధరించడం వల్ల కార్బన్ డయాక్సైడ్ పీల్చడానికి దారితీస్తుందని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి నేపథ్యంలో మాస్క్ల ధరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. స్వతహాగా వైద్యుడైన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అధిక సమయం మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమని, కాబట్టి ఎక్కువగా మాస్కులను ధరించొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో మాస్కులు ధరించి, కొవిడ్ టీకా తీసుకోవాలని, భౌతికదూరం పాటించాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. డాక్టరైన ఎమ్మెల్యే మాత్రం నోరుజారడంతో దుమారం రేగుతోంది. రెండు రోజుల కిందట ధన్బాద్లోని వాసేపూర్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే అన్సారీ.. మాస్క్ వేసుకోవడంపై మీడియా ప్రతినిధులు నిలదీశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మాస్క్లు ఎక్కువ కాలం ధరించకూడదని ఒక వైద్యుడిగా నేను కరోనా బారిన పడిన వారితో చెబుతున్నాను.. ముక్కు నుంచి వచ్చిన కార్బన్ డయాక్సైడ్ను మళ్లీ పీల్చాల్సి వస్తుంది.. కోవిడ్ సోకినవారు భయపడకూడదు.. ప్రశాంతంగా ఓపికతో ఉండాలి.. ఇన్ఫెక్షన్ నాలుగు నుంచి ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం ఉండదు’’ అని అన్సారీ అన్నారు. ఇర్ఫాన్ వ్యాఖ్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ అజయ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే సాకులు చెబుతున్నారని, ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మానసిక సమతౌల్యతను కోల్పోయారని బీజేపీ నేత సీపీ సింగ్ విమర్శించారు. అంతేకాదు, ఒకసారి ఇర్ఫాన్ అన్సారీ ఎంబీబీఎస్ డిగ్రీని పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కొవిడ్ -19 నిబంధనలు ఉల్లంఘించడమే కాదు.. ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చిన ప్రేరేపించినందుకు అన్సారీపై కేసు పెట్టాలని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa