కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అడ్డుకుంటోందని మంత్రి కొడాలి నాని విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీపై మంత్రి కొడాలి నాని విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అడ్డుకుంటోందని ఆయన అంటున్నారని, దమ్ముంటే ఆధారాలు చూపాలని చాలెంజ్ చేశారు. అసలు కొడాలి నానికి ఆయన శాఖపై కనీస అవగాహన ఉందా? అని బోండా ఉమ నిలదీశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రంలో నిరసనలు జరుగుతుంటే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అర్ధరాత్రి సమయంలో తమ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో కేసినో నిర్వహించి, అమ్మాయిలతో డ్యాన్స్ చేయించిన నానిపై ఇప్పటివరకు కేసు పెట్టలేదని చెప్పారు. దీనిపై రాష్ట్ర డీజీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం విశాఖలో అదానీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు అప్పచెప్పారని ఆయన ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని, ఇందుకు గాను వైసీపీ సర్కారు గిన్నిస్ రికార్డు సాధిస్తుందని బోండా ఉమా ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ ఉప్పుల ఊబిలోకి లాగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa