రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆఫ్రికా ఖండంలోని డ్జిబౌతీ, ఇథియోపియా దేశాలకు బయల్దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆ రెండు దేశాలతో విదేశీ కార్యాలయ కన్సల్టేషన్ పనులతో పాటు కొన్ని ఆర్థిక ఒప్పందాలపై కూడా సంతకాలు చేయనున్నారు. భారత్తో హిందూ మహాసముద్రం వారధిగా సరుకు రవాణా కార్యకలాపాలు సాగించే దేశాల్లో డ్జిబౌతీ ప్రముఖమైనది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం దాదాపు 284 మిలియన్ డాలర్ల వరకు భారత్తో వ్యాపారం కొనసాగించింది. భారత విదేశాంగ విధానంలో హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆఫ్రికా దేశాలు చాలా కీలకమైనవి. అందుకే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన మొదటి అధికారిక విదేశీ పర్యటన కోసం ఆ దేశాలను ఎంచుకున్నారని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలియజేశారు. డ్జిబౌతీ దేశంలో ఓ సిమెంట్ ప్లాంట్ నిర్మించడానికి భారత్ 49 మిలియన్ డాలర్లను లైన్ ఆఫ్ క్రెడిట్గా కేటాయించింది. ఇక ఇథియోపియా విషయానికి వస్తే... 45 ఏళ్ల తర్వాత ఆ దేశాన్ని సందర్శించనున్న భారత రాష్ట్రపతిగా కోవింద్ నిలిచారు. చివరిసారిగా 1972లో అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి ఇథియోపియా వెళ్లారు. 2016లో ఇథియోపియాతో ద్వైపాక్షికంగా ఒక బిలియన్ డాలర్ల వరకు వ్యాపారం జరిగింది. ఇరు దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా రాష్ట్రపతి సమావేశం కానున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa