ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మశానంలో పత్రాలు తీసుకుని చివరి నిమిషంలో నామినేషన్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:36 PM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల వేళ నాగ్‌పుర్‌లో అత్యంత భావోద్వేగపూరితమైన, అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాజకీయ పోరాటాల కంటే మానవ సంబంధాలు, బాధ్యతలు మిన్న అనిపించేలా సాగిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఈ క్రమంలోనే నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 5వ వార్డు నుంచి పోటీ చేసేందుకు శివసేన (ఏక్‌నాథ్ శిందే వర్గం) నాయకుడు యోగేష్ గొన్నాడే సిద్ధమయ్యారు. అయితే సరిగ్గా నామినేషన్ల పర్వం ఊపందుకున్న సమయంలోనే ఆయన తల్లి కన్నుమూశారు. కన్నతల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న యోగేష్.. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి అంత్యక్రియల ఏర్పాట్లలో మునిగిపోయారు.


నామినేషన్లు దాఖలు చేయడానికి ఆ రోజే ఆఖరి గడువు కావడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. యోగేష్ గొన్నాడే అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసినప్పటికీ.. ఆయన శ్మశాన వాటికలో ఉండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చివరకు సమయం మించిపోతుండటంతో పార్టీ నాయకులు నామినేషన్ పత్రాలు (బి-ఫామ్) పట్టుకుని హుటాహుటిన శ్మశాన వాటికకే చేరుకున్నారు. తల్లి చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే యోగేష్‌కు ఆ పత్రాలను అందజేశారు.


కన్నతల్లికి చివరి వీడ్కోలు పలుకుతున్న వేళ.. అభ్యర్థిత్వానికి సంబంధించిన ఆమోదం లభించడంతో యోగేష్ గొన్నాడే తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అంత్యక్రియల క్రతువు ముగిసిన వెంటనే.. నేరుగా ఎన్నికల కార్యాలయానికి వెళ్లి చివరి నిమిషంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఒకవైపు కన్నతల్లిని కోల్పోయిన బాధ, మరోవైపు ప్రజల కోసం పని చేయాలన్న పార్టీ అప్పగించిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య ఆయన ప్రయాణం అక్కడి వారిని కదిలించింది.


ఈ ఎన్నికల్లో కేవలం యోగేష్ మాత్రమే కాకుండా.. ఆయన కుమార్తె కృతిక గొన్నాడే కూడా బరిలోకి దిగారు. నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 8వ వార్డు నుంచి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ ఒకేసారి ఎన్నికల బరిలో నిలవడం.. అది కూడా ఇలాంటి విషాద సమయంలో జరగడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల్లో పదవుల కంటే బాధ్యతలే ముఖ్యమని భావించిన యోగేష్ గొన్నాడే సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa