ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్లుగా తాగి ఊగితే ఇంటికి తీసుకెళ్లే బాధ్య ప్రభుత్వానిదే

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:33 PM

నూతన సంవత్సర వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లేవారిని పోలీసులు క్షేమంగా వారి ఇళ్ల వద్ద దింపుతారని రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు. రోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను అరికట్టడంతో పాటు మందుబాబుల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


15 ప్రత్యేక ప్రాంతాల గుర్తింపు..


అతిగా మద్యం సేవించిన ప్రతి ఒక్కరినీ నేరుగా ఇంటికి చేర్చడం సాధ్యం కాకపోవచ్చని.. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. మైకం దిగే వరకు మద్యం బాబులను ఉంచడానికి బెంగళూరు వ్యాప్తంగా 15 ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే ఇదే సమయంలో ఆయన ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. మద్యం మత్తులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఇదీ చూడండి: మందుబాబులకు న్యూ ఇయర్ ధమాకా.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు


20 వేల మందితో భారీ భద్రత..


వేడుకల నేపథ్యంలో భద్రతను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ముఖ్యంగా బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా మహిళలకు రక్షణ కల్పించేందుకు 20 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా పోలీసు బృందాలు కూడా ఉన్నాయని, అధునాతన సాంకేతికతతో నిఘా పెంచుతున్నామని ఆయన వివరించారు. మైసూర్, హుబ్బళి, మంగళూరు వంటి ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది.


కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఇలా ఉంటే.. పక్కనే ఉన్న తెలంగాణలోనూ మద్యం సేవించిన వారికి సహాయం చేయడానికి గిగ్ వర్కర్స్ యూనియన్ ముందుకొచ్చింది. న్యూ ఇయర్ వేళ మద్యం తాగి డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు 500 వాహనాలతో ఉచిత రవాణా సేవలు అందిస్తామని యూనియన్ ప్రకటించింది. ఇందులో క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మొత్తానికి 2026 నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa