ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనమహిళలకు నూతన సంవత్సర కానుక అందించారు. గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత వంటి రుగ్మతలకు కారణమయ్యే సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షణ కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా ఈ బ్లడ్ బ్యాంకు భవనం నిర్మించనున్నారు. ఇందులో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో.. దాతల సహకారంతో ఈ బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మిస్తున్నారు.
బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి దీనిని అనుసంధానం చేస్తారు. మరోవైపు అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవం కోసం పవన్ కళ్యాణ్ అరకు నియోజకవర్గంలోని కురిడీ గ్రామ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మాటా మంతి కార్యక్రమంలో ఓ మహిళ సికిల్ సెల్ అనీమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని ఆమె వివరించారు. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు.
సికిల్ సెల్ అనీమీయా నివారణ ఎలా? అనే అంశంపై వైద్య నిపుణులతో చర్చించిన పవన్ కళ్యాణ్.. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రత రక్తమార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుమారు 1,500 మంది సికిల్ సెల్ అనీమియా బాధితులకు ఉపశమనం కలగనుంది. దీంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa