దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరుగాంచిన ఇండోర్లో పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని భగీరథ్పురా ప్రాంతంలో కలుషిత నీరు తాగి గత కొద్దిరోజులుగా అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా.. మరణాల సంఖ్య బుధవారం నాటికి ఎనిమిదికి చేరింది. తాగునీటి పైప్లైన్లోకి డ్రైనేజీ నీరు చేరడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలకు ఆదేశించింది.
అధికారులపై వేటు.. సీఎం సీరియస్!
ఈ దారుణ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆయన వేటు వేశారు. జోనల్ ఆఫీసర్ శాలిగ్రామ్ సితోలే అసిస్టెంట్ ఇంజనీర్ యోగేష్ జోషిలను సస్పెండ్ చేయగా.. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సూపర్ ఇంటెండెంట్ ఇంజనీర్ శుభమ్ శ్రీవాస్తవను సర్వీస్ నుంచి తొలగిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం.. బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 25వ తేదీన సరఫరా అయిన మున్సిపల్ నీరు వింత రుచి, వాసన వస్తోందని స్థానికులు అప్పుడే ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. మంగళవారం వరకు ముగ్గురు చనిపోగా, బుధవారం నాటికి ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ బాధితులను పరామర్శిస్తూ.. ఇది కేవలం డ్రైనేజీ నీటి వల్ల జరిగిన మరణాలు కావని, ఏదో విషపూరిత పదార్థం నీటిలో కలిసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటన ఇండోర్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ పుష్యమిత్ర భార్గవ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మున్సిపల్ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ యూనిట్ పోలీసులను ఆశ్రయించనుంది. మరోవైపు స్థానిక మంత్రి కైలాష్ విజయ వర్గీయ ఆసుపత్రులకు వెళ్లి బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షించారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉండే ఇండోర్లో ఇలాంటి ప్రాథమిక సౌకర్యాల లోపం వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం పట్ల పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం భగీరథ్పురాలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి.. నీటి నమూనాలను పరీక్షలకు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa