ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్ దిగుమతులపై 12 శాతం టారిఫ్‌లు,,,,,చైనాకు షాకిచ్చిన భారత్

international |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:50 PM

చైనా నుంచి వస్తున్న చౌకైన ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయానికి తెరతీసింది. దేశీయ ఉక్కు రంగాన్ని రక్షించే ఉద్దేశంతో చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉక్కు ఉత్పత్తులపై మూడేళ్ల కాలానికి సేఫ్ గార్డ్ డ్యూటీని విధిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చైనాతోపాటు.. వియత్నాం, నేపాల్‌ వంటి దేశాల నుంచి తక్కువ ధరకే స్టీల్ ఉత్పత్తులు దిగుమతి కావడం వల్ల.. భారత స్టీల్ ఉత్పత్తి దారులు తీవ్రంగా నష్టపోతున్నారనే వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు సుంకాలు దశలవారీగా అమలు కానున్నాయని.. భారత ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తెలిపింది.


తొలి ఏడాది అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు 12 శాతం.. రెండో ఏడాది 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం చొప్పున ఈ సుంకాలు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మరీ ముఖ్యంగా చైనా, వియత్నాం, నేపాల్ వంటి దేశాల నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న చౌక ఉక్కు దిగుమతుల వల్ల దేశీయ తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


అయితే.. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు, స్టెయిన్‌లెస్‌ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఈ టారిఫ్‌ల నుంచి మినహాయింపు కల్పించారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్ వంటి ప్రధాన ఉక్కు కంపెనీల షేర్లు 5 శాతం వరకు లాభపడ్డాయి.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వాణిజ్య నిర్ణయాల వల్ల చైనా ఉక్కు ఇతర మార్కెట్ల వైపు మళ్లుతున్న నేపథ్యంలో.. భారత్ తన దేశీయ మార్కెట్‌ను రక్షించుకోవడానికి ఈ దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఏప్రిల్‌లో విధించిన 200 రోజుల తాత్కాలిక సుంకం ముగియడంతో.. ఇప్పుడు ఈ 3 ఏళ్ల శాశ్వత సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa