చైనా ఇపుడు ప్రపంచంపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతూ.. మరో వైపు తైవాన్ ను ఎప్పుడు కబళిద్దామా అని అదను కోసం చూస్తున్న డ్రాగన్ (చైనా).. రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేసింది. వార్షికంగా చూస్తే 7 శాతం అధికంగా కేటాయించింది. గతేడాది బడ్జెట్ లో 209 బిలియన్ డాలర్లు కేటాయించగా.. తాజాగా 2022 ఆర్థిక సంవత్సరానికి దీన్ని 230 బిలియన్ డాలర్లకు (రూ.17.25 లక్షల కోట్లు) పెంచింది. ఇందుకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రధాని లీ కెకియాంగ్ నేషనల్ కాంగ్రెస్ కు (చైనా పార్లమెంట్)కు సమర్పించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సమగ్ర యుద్ధ సన్నద్ధతను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని కెకియాంగ్ ప్రస్తావించారు. 2022-23 బడ్జెట్ లో భారత్ రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు 70 బిలియన్ డాలర్లు (రూ.5.25 లక్షల కోట్లు)గా ఉన్నాయి. అంటే మన దేశంతో పోలిస్తే మూడు రెట్లకు పైనే అధిక కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్నది చైనాయే. అమెరికా రక్షణ రంగ కేటాయింపులు 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఎక్కువ. ప్రపంచంలో అతిపెద్ద సైనిక బలం చైనాకే ఉంది. 23 లక్షల మంది సైనిక బలం ఉండగా 2017లో 20 లక్షలకు తగ్గించుకుంది. భారత్ కు 14 లక్షల మంది సైనికులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa