|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 06:29 PM
తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లు, లక్కీ డ్రా ప్రక్రియ ముగిసింది. మద్యం దుకాణాల కేటాయింపుకు సంబంధించి అక్టోబర్ 26 న లక్కీ డ్రా నిర్వహించారు. కొందరు అదృష్టవంతులకు ఒకటి కన్నా ఎక్కువ మద్యం దుకాణాలు దక్కాయి. రాజు యాదవ్ అనే వ్యక్తికి అయితే ఏకంగా 12 మద్యం దుకాణాలు దక్కాయి. ఇదిలా ఉంటే తాజాగా లక్కీ డ్రాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం షాపు దక్కించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వారు చర్యలకు సిద్ధమయ్యారు. అసలేం జరిగింది అంటే..
తెలంగాణలో గత నెలలో అనగా అక్టోబర్ 26న నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రాలో మహబూబ్నగర్కు చెందిన పీఈటీ టీచర్ పుష్పకు మద్యం షాపు దక్కడం వివాదాస్పదంగా మారింది. ఆమె మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ బాలిక ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా నిర్వహించిన మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియలో ఆమె కూడా పాల్గొన్నారు. రూ.3 లక్షలు డిపాజిట్ చెల్లించి.. ధర్మాపూర్ వైన్స్కు దరఖాస్తు చేసుకున్నారు.
ఈక్రమంలో అక్టోబర్ 26న నిర్వహించిన డ్రాలో ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. మద్యం షాపు గెలుచుకుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రాలో ఆమె పేరు వచ్చింది. దీంతో పత్రాలపై సంతకాలు చేసి టెండర్ను ఖరారు చేసుకున్నారు. ఆమెకు మద్యం షాపు రావడంపై కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేశారు. సంబరాలు చేసుకున్నారు. అయితే వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రభుత్వ ఉద్యోగి మద్యం టెండర్లో పాల్గొనడంపై వ్యాపారులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుష్ప లీవ్ తీసుకుని మరీ మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి టెండర్, వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనకూడదని అధికారులు చెబుతున్నారు. అలాంటిది ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన పుష్ప ఏకంగా మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో పాల్గొనడం.. ఆపై షాపు దక్కించుకోవడం వివాదాస్పదంగా మారింది.
ఆమె నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కాస్త జిల్లా వ్యాప్తంగా వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు చర్యలకు దిగారు. పీఈటీ పుష్పపై సస్పెన్షన్ విధిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వారు పాపం వైన్ షాపు వచ్చింది.. ఉద్యోగం పోయే పరిస్థితి తెచ్చింది అని కామెంట్స్ చేస్తున్నారు.