|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 07:15 PM
భారత్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ పర్యటన కొనసాగుతోంది. శనివారం భారత్లో అడుగుపెట్టిన మెస్సీ.. మొదట కోల్కతా.. ఆ తర్వాత హైదరాబాద్లో పర్యటించారు. అనంతరం ముంబైకి వెళ్లారు. ఇక కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ రాక సందర్భంగా తలెత్తిన గందరగోళం.. ఆయన ఫ్యాన్స్కు తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ హైదరాబాద్ టూర్ మాత్రం.. అటు మెస్సీకి, ఇటు తెలుగు ప్రజలకు బాగా గుర్తుండిపోయేదిగా నిలిచింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ టీమ్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఆడటం.. ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపింది.
ఈ సందర్భంగా హైదరాబాదీ వంటకాల రుచిని మెస్సీ చూశారు. ఈ క్రమంలోనే డిన్నర్లో హైదరాబాదీ మటన్ బిర్యానీ, హలీమ్ బాగా ఇష్టంగా తిన్నారు. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో మెస్సీ బస చేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన మెస్సీకి ఫలక్నుమా ప్యాలెస్లోని నిజాం లగ్జరీ సూట్ కేటాయించారు. ఉప్పల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ తర్వాత.. రాత్రి నిర్వహించిన డిన్నర్లో హైదరాబాదీ మటన్ బిర్యానీ ఇష్టంగా ఆరగించారు. అలాగే హలీమ్ను కూడా వడ్డించారు.
ఇవి మాత్రమే కాకుండా నిజాం వంటకాలైన మరగ్, పాయా, పన్నీర్ టిక్కా, కబాబ్, దాల్, నాన్ రోటీలు, బడల్ కా మీటా, ఖుర్బానీ కా మీటా, మలాయ్ కుల్ఫీ, ఇటాలియన్ ఫుడ్ కూడా మెనూలో ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ అందాలు చూసి.. మెస్సీ మైమరిచిపోయారు. ఇక ఫలక్నుమా ప్యాలెస్లో 101 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే నిజాం డైనింగ్ టేబుల్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. హైదరాబాద్ ఆతిథ్యం మరిచిపోలేనిదని కితాబు ఇచ్చారు.
ఇక శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీ నిన్న ఇక్కడే బస చేశారు. ఆదివారం స్పెషల్ ఫ్లైట్లో లియోనెల్ మెస్సీ బృందం.. ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముంబై బయల్దేరి వెళ్లింది. అక్కడ వాంఖడే స్టేడియానికి మెస్సీ చేరుకోనున్నారు.