|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 07:42 PM
పటాన్చెరు : త్వరలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్ర సత్తాను చాటాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల పటాన్చెరులో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్ 14 బాలురు బాలికల కబడ్డీ, అండర్ 17 బాలుర వాలీబాల్ పోటీలలో విజేతలు ఆదరించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు, కోచ్ లకు సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్ సూట్లను ఆయన పంపిణీ చేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులకు రవాణా భత్యం అందించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గాన్ని కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో పటాన్చెరు పట్టణంలో వివిధ క్రీడల్లో జాతీయస్థాయి పోటీలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు తమ విద్యార్థులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయి పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శన అందించి తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఎగురవేయాలని కోరారు.