ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దంచికొడుతున్న ఎండలు.. ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు, ఈ జాగ్రత్తలు తీసుకోండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 04, 2024, 08:04 PM

తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది. పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన ఉక్కపోత, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 దాటిందంటే చాలు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నారు. ఏప్రిల్‌ మొదటి రెండు మూడు రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందుముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గద్వాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాడ్పుల తీవ్రత కొనసాగనుందని వాతావరణశాఖ నిపుణులు అంటున్నారు. వడగాల్పుల కారణంగా ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు వడదెబ్బ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


తెలంగాణలో ఎండలు, వేడి గాలులు.. ప్రజలకు బిగ్ అలర్ట్


ఈ జాగ్రత్తలు తీసుకోండి..


ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లు ఉపయోగించాలి.


వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు మాత్రమే ధరించాలి. ఇవి చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు ఎండలో తిరగకపోవటమే మంచిది. ఒకవేళ అత్యవసర పనిపై బయటకు వెళ్తే.. గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలి.


ఇంట్లో ఉన్నా.. తరచూ నీరు తాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్‌ పుష్కలంగా లభించి వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిఒక్కరూ రోజుకు కనీసం 4 లీటర్లు నీరు తాగాలి. ఎండలో పని చేసేవారు మరో లీటరు అదనంగా తీసుకోవాలి.


వేసవిలో కలుషిత నీళ్ల ముప్పు అధికం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లటం ఉత్తమమైన పని. తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలి.


మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే డీహైడ్రేషన్‌ వల్ల బీపీ తగ్గి ఉంటుంది. ఈ సమయంలో బీపీ మందులు వేసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. బీపీ రోగులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


ఎండాకాలంలో మద్యం శరీరానికి మరింత మప్పు చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉంటే మేలు. వేడి చేసి చల్లార్చిన నీటిలో ORS కలుపుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa