రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నడుస్తోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 13నే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరగనుండగా.. ఓటేసేందుకు ప్రజలు స్వస్థలాలకు క్యూ కట్టారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో సెటిల్ అయిన చాలా మంది ఓటేసేందుకు వెళ్తున్నారు. శుక్రవారం నుంచే ఆర్టీసీ బస్సులు, ట్రైన్లు కిక్కిరిపోయాయి. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. పెద్ద అంబర్ పేట వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పార్లమెంట్ అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మెదక్ ఎంపీ అభ్యర్థులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థులకు టెన్షన్ మెుదలైంది. ఈ నియోజకవర్గ పరిధిలో సెటిలర్ల ఓట్లు లక్షల్లో ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతంలో సెటిల్ అయిన చాలా మంది ఏపీ ఓటర్లకు ఇక్కడ కూడా ఓట్లు ఉన్నాయి. అయితే వారందరూ ఏపీలో ఓటేసుందుకు పయనం అవుతున్నారు. కానీ తెలంగాణలోనే ఓటేయాలని తెలంగాణ నేతలు ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది.
ఏదో ఒక చోట మాత్రమే ఓటేసే ఛాన్స్ ఉండటంతో భారీగా డబ్బులు కూడా ముట్టజెప్పుతున్నట్లు టాక్. సెటిలర్ల ఓట్లకు ఒక్కో ఓటుకు రూ. 5 వేల చొప్పున ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ముట్టజెప్పినట్లు టాక్. మరో ప్రధాన పార్టీ అభ్యర్థి కూడా అదే బాటలో భారీగా డబ్బులు అందజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీలోని నేతలు కూడా ఇక్కడి సెటిలర్లను తరలించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వారి కోసం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ ఖర్చుల కింద డబ్బులు కూడా ముట్టజెప్పుతుున్నట్లు తెలిసింది. ఇలా రెండు రాష్ట్రాల నేతలు సెటిలర్లకు డబ్బులు ఇస్తుండటంతో వారు పండగ చేసుకుంటున్నారు. అయితే వారు ఎక్కడ ఓటేస్తారో తెలియక నేతలకు మాత్రం టెన్షన్ పట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa