ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం.. పాపం నిరుద్యోగి, చివరకు ఇలా..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 14, 2024, 08:12 PM

ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులే టార్గెట్‌గా కొందరు కేటుగాళ్లు ఈజీగా మోసం చేస్తున్నారు. ఇక ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల విసురుతున్న ఘటనలు అనేకం. తాజాగా.. మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ నిరుద్యోగి నిలువునా మోసపోవటంతో పాటు ప్రాణాలు సైతం తీసుకున్నాడు. నిజామాబాద్ లింగంపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి ప్రవీణ్‌ (28) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. అతడికి 2019లో తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆరీఫ్‌తో పరిచయమైంది. మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవీణ్‌ను ఆరీఫ్‌ నమ్మించాడు. నిజామాబాద్‌కి చెందిన రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్‌కే రెడ్డి వద్దకు తీసుకెళ్లి రూ. 7 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ముందస్తుగా ఆరీఫ్‌ రూ.2 లక్షల రూపాయలు తీసుకున్నారు.


తర్వాత మరో రూ.5 లక్షలను విడతలవారీగా తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని నాలుగేళ్లు అవుతున్నా ఉద్యోగం గురించి ఎటు తేల్చకపోవడంతో ప్రవీణ్‌ వారిద్దరిని నిలదీశాడు. అయితే మరో రూ.లక్ష ఇస్తే ఉద్యోగానికి చెందిన ఆర్డర్‌ కాపీ ఇస్తామని చెప్పడంతో వారి మాటలు నమ్మి మరో లక్ష ముట్టజెప్పాడు. తీరా ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ కాపీ తీసుకొని మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో మాట్లాడగా.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఫేక్ అని తేలింది.


దీంతో తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని ప్రవీణ్ అనేక సార్లు బతిమిలాడినా.. వారు మాట దాట వేస్తూ వచ్చారు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న ఆలయం వద్ద వేప చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa