హనుమకొండలో వింత ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని రెండో డివిజన్లోని రెడ్డి పురం కోవెలకుంటలో ఒక మనిషి శరీరం.. సోమవారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే అలా తేలియాడుతూ కనిపించింది. అది గమనించిన స్థానికులు ఎవరో వ్యక్తి మృతదేహం అనుకుని.. వెంటనే కేయూ పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు.. చెరువులో ఉన్న ఆ దేహంలో ఎలాంటి కదలిక లేకపోవటంతో.. మృతి చెంది ఉంటాడన్న నిర్ణయానికి వచ్చారు.
దీంతో.. స్థానికుల సహాయంతో ఒకరి చేతి మరొకరు పట్టుకొని.. ఆ దేహాన్ని బయటికి తీసేందుకు పూనుకున్నారు. ఆ దేహం చేతిని పట్టుకుని బయటికి లాగటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఒక్కసారిగా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఊహించని ఆ పరిణామంతో పోలీసులతో పాటు అక్కడున్న స్థానికులకు ఒక్కక్షణం గుండె ఆగినంత పనైంది. అయితే.. ఆ వ్యక్తి బతికే ఉండగా.. కావాలనే అలా చెరువులో పడుకున్నట్టు చాలా ఆలస్యంగా అందరికీ అర్థమైంది.
అంత మందిని జడుసుకునేలా చేసిన ఆ వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడిగా గుర్తించారు. పీకలదాకా తాగి అందులో పడుకున్నట్టు గుర్తించారు. అయితే.. అలా ఎందుకు పడుకున్నావని అడిగితే.. బయట ఉన్న వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం చెరువులో పడుకున్నట్టు చెప్పటంతో అందరు ఘోల్లున నవ్వారు. రోజూ తాను గ్రనైట్ కంపెనీలో 12 గంటలు పని చేస్తానని.. ఒళ్లంతా హూనం అవుతుందని.. అందుకే చెరువులో ఇలా సేదతీరానని ఆ మందుబాబు తన కష్టం చెప్పుకొచ్చాడు.
4 నుంచి 5 గంటల పాటు చెరువులో కదలకుండా పడుకోవటంతో.. అందరూ చనిపోయావనుకుని కంప్లైంట్ చేశారని.. ఒకవేళ నీళ్లలోకి జారిపోతే ఎలా అని పోలీసులు ప్రశ్నిస్తే.. అలా ఏం లేదని.. రాయిని ఆధారంగా చేసుకుని పడుకున్నానని తెలిపాడు ఆ మందుబాబు. చివరికి తనకు ఒక 50 రూపాయలు ఇస్తే తాను అక్కడి నుంచి వెళ్లిపోతానంటూ పోలీసులకు కోరాడు. అందరినీ ఆందోళనకు గురి చేసిన ఆ మందుబాబుును పోలీసులు పోలీస్ స్టేషన్ను తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa