ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ గుజరాత్‌ను మించిపోయింది.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 07:40 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా బాగా పని చేస్తున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. రాష్ట్రాన్ని కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నారని.. అందుకే స్వయంగా వచ్చి కలిశానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన చంద్రబాబు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రశంసలు కురిపించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని చంద్రబాబు కొనియాడారు. పెద్ద రాష్ట్రాలైన.. గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని ప్రశంసలు కురిపించారు. అందుకు కారణం.. ఆ కాలంలో టీడీపీ చేపట్టిన అభివృద్ధేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.


హైదరాబాద్‌లో హైటెక్ సిటిని అభివృద్ధి చేసి.. దేశంలో నెంబర్ వన్‌గా చేశామని చంద్రబాబు వివరించారు. దూరదృష్టితో ఆలోచించి.. ఔటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్ట్‌లను ప్రతిపాదన చేసి.. ప్రారంభించామని తెలిపారు. అయితే.. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొనసాగించాయని.. ఈ సందర్భంగా వాటిని అభినందిస్తున్నట్టు తెలిపారు.


తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా కొనసాగుతామని చంద్రబాబు తెలిపారు. తాను.. ఆంధ్రా తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. కొంత మంది గొడవలు పెట్టుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని.. గొడవలు పడితే నీళ్లు రావని.. పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురుకోవాలని సూచించారు. అదే.. కలిసి సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు తీరుతాయన్నారు.


మంచి పరిపాలన లేకపోతే రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఏపీ చాలా నష్టాల్లో ఉందని.. ఎంత కష్టపడైనా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. విజన్-2020 అని తాను ఎప్పుడో చెప్పానని.. కానీ అప్పుడు అందరూ ఎగతాళి చేశారన్నారు. సెల్‌ఫోన్ కడుపు నింపుతుందా అని మాట్లాడారు.. ఇప్పుడు మళ్లీ చెబుతున్న విజన్-2047 అభివృద్ధి చెందిన భారత్ ఉంటుందన్నారు. తెలుగుజాతి గ్లోబల్ నెంబర్ వన్‌‍గా ఉండాలన్నారు. మొన్నటి వరకు బ్రిటన్‌ను పాలించింది కూడా భారతీయుడే అని గుర్తుచేశారు. ప్రపంచంలో అందరికంటే ఆమోదమైన వ్యక్తులు భారతీయులన్నారని తెలిపారు. ప్రపంచానికి సేవ చేసే శక్తి మన భాతీయులకు ఉందన్నారు. తెలుగువారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తాను తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తన రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేరన్నారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. ఆదిలాబాద్ మొదలు శ్రీకాకుళం వరకు తాను తిరగని ప్రాంతం లేదన్నారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజా సేవ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. వచ్చే 30 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్ ఆలోచిస్తానని అన్నారు. మరోవైపు.. తెలంగాణలో త్వరలోనే టీడీపీకి కొత్త స్ట్రాక్చర్ తీసుకొస్తానని చంద్రబాబు తెలిపారు. యువకులకు అవకాశం ఇస్తానని తెలిపారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa