ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా, దీపావళికి వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు.. 1400 రైలు ట్రిప్పులు, ఇక ఆ చింత అక్కర్లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 08:21 PM

దసరా, దీపావళి దేశంలోనే పెద్ద పండగలు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండగలకు సొంతూళ్లకు చేరుకుంటారు. అందుకు బస్సులు, ట్రైన్లు ఆశ్రయిస్తుంటారు. ప్రతిసారి పండగల సమయంలో ట్రైన్లు రద్దీగా ఉంటాయి. దీంతో ప్రయాణాలు నరకప్రాయం అవుతుంటాయి. అయితే ఈసారి ఆ చింత అక్కర్లేదు. పండగలకు సొంతూళ్లకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది.


దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో పెట్టుకుని జోన్‌ పరిధిలో స్పెషల్ ట్రిప్పులు తిప్పనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం 1,400 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడిపిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ స్పెషల్ ట్రైన్లు.. ఏపీ, తెలంగాణతో పాటుగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలకూ అందుబాటులో ఉంటాయని చెప్పారు. అక్టోబరు 30వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్ రాకపోకలు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి సహా జోన్‌ పరిధిలోని మెుత్తం 150 రైల్వేస్టేషన్లలో ‘నవరాత్రి స్పెషల్‌ థాలీ’ పేరుతో ప్రయాణికులకు ప్రత్యేక భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.


దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ సారి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు నేప‌థ్యంతో ర‌ద్దీ దృష్ట్యా గ‌త ఏడాదితో పోల్చితే అద‌నంగా మరో 600 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను నడుపుతోంది. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.


ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా వలంటీర్లనూ నియ‌మించామన్నారు. కాగా, ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల్లో టికెట్ ధరలు పెంచారు. దాదాపు 50 శాతం అదనంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa