ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రిని రోడ్డుపై వదిలేసిన కొడుకులు.. దిమ్మతిరిగే గుణపాఠం చెప్పిన ఆర్డీవో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2024, 08:19 PM

జన్మనిచ్చి.. పెంచి పెద్ద చేసి.. చదువులు చెప్పించి ప్రయోజకులను చేసి.. మా బిడ్డలు మాలాగా కష్టపడోద్దు సుఖంగా ఉండాలని.. చెమటోడ్చి సంపాధించిన ఒక్కో రూపాయి కూడబెట్టి ఆస్తులు పోగేసి చేతుల్లో పెడితే.. ఆనందంగా తీసుకుని అనుభవిస్తూ.. ఇన్ని కన్నతల్లిదండ్రులను మాత్రం వృద్ధాప్య దశలో అనామకులుగా రోడ్డుపై వదిలేస్తున్న ప్రబుద్ధులెందరో. వారి బాధను ఎవరికీ చెప్పుకోలేక.. కొడుకులను కోప్పడటానికి మనసొప్పక.. ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టేసి.. రోడ్లపై భిక్షాటన చేస్తూ చాలా మంది వృద్ధులు తమ చివరి క్షణాలను దుర్భరంగా గడువుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో. ఆస్తులన్ని తీసుకుని.. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పట్టించుకోకపోవటంతో.. రోడ్డుపై భిక్షాటన చేస్తూ రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన సిరిసిల్ల ఆర్డీవో.. స్వయంగా రంగంలోకి దిగి.. ఆ ప్రబుద్ధులకు దిమ్మతిరిగే గుణపాఠం చెప్పారు.


సిరిసిల్లకు చెందిన అదువాల రాజమల్లుకు అనిల్ కుమార్, సురేశ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లకు రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం తంగళ్లపల్లి మండలంలోని కేసీఆర్‌ నగర్‌లో డబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించింది. ఇల్లు రాజమల్లు పేరున ఇవ్వాల్సి ఉండగా.. పెద్దకొడుకు అనిల్ కుమార్ అతితెలివి ప్రయోగించి.. ఇంటిని తన భార్య పేరిట రాయించుకున్నాడు.


తండ్రి పేరు మీద వచ్చిన ఇంట్లోనే ఉంటూ.. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని పట్టించుకోకుండా వదిలేశాడు పెద్ద కొడుకు. పట్టించుకోని పెద్దోడితో ఉండటమెందుకని.. చిన్నోడి దగ్గరికి వెళ్తే.. ఇళ్లు అనుభవిస్తున్న కొడుకే పట్టించుకోనప్పుడు నాకే అవసరం అంటూ పుల్లవిరుపు మాటలు అనటంతో.. ఎవరినీ ఏమీ అనలేక గత 6 నెలలుగా రాజమల్లు రోడ్లపైనే ఉంటూ భిక్షాటన చేసుకుంటూ కడుపునింపుకుంటున్నాడు. ఈ క్రమంలో తనను కొడుకులు పట్టించుకోవడం లేదని ఆర్డీవోకు మొరపెట్టుకున్నాడు రాజమల్లు. ఆ తండ్రి బాధ పూర్తిగా అర్థం చేసుకున్న ఆర్డీవో రమేష్.. పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని తంగళ్లపల్లి ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారించిన ఎమ్మార్వో.. రాజమల్లును తన కొడుకులు పట్టించుకోవటం లేదని నివేదిక ఇచ్చారు. దీంతో.. డబుల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్న పెద్ద కొడుకును వారం రోజుల్లో ఖాళీ చేసి.. తండ్రికి ఇల్లు అప్పగించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా.. ఇద్దరు కొడుకులు తండ్రికి ఖర్చులకు నెలనెలా 2 వేల రూపాయలు ఇవ్వాలని ఆర్డీవో ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇంటిని రాజమల్లు పేరున మార్చాలని.. ఎమ్మార్వోకు సూచించారు. తనకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన అధికారులకు రాజమల్లు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa