ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఫార్మాట్ ఇదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2024, 07:36 PM

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పటికే కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై అసెంబ్లీలోనూ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 29న) రోజున సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో ఓ ఫామ్‌ను విడుదల చేసింది. ఈ సర్వేలో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించిన.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సబంధించిన వివరాలను అధికారులు సేకరించనున్నారు. కుటుంబాల నుంచి అధికారులు సేకరించనున్న వివరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం విడుదల చేసిన ఫామ్‌లో పొందుపరిచారు.


సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో రెండు పార్టులుగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించనున్నట్టు ఈ ఫామ్ ద్వారా తెలుస్తోంది. పార్టు-1లో.. కుటుంబ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు నమోదు చేసుకోనున్నారు. కుటుంబ సభ్యుల పేర్లతో పాటు కుటుంబ యజమానితో ఉన్న రిలేషన్, మతం, కులం, సామాజిక వర్గం, మాతృభాష, ఆధార్ కార్డు వివరాలు సేకరించనున్నారు. వీటితో పాటుగా.. దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి సమాచారం, వైవాహిక స్థితి కూడా నమోదు చేసుకోనున్నారు.


మరోవైపు.. విద్యాబ్యాసానికి సంబంధించిన వివరాలను కూడా ప్రభుత్వం సేకరించనుంది. ఇందులో ఎలాంటి పాఠశాలలో విద్యను అభ్యసించారు, విద్యార్హతలు, అత్యున్నత విద్య ఏ మాధ్యమంలో చదివారనే వివరాలతో పాటు.. పాఠశాలలో చేరిన నాటికి వయసు, బడి మానేసినట్టయితే అందుకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరించనున్నారు.


వీటితో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఉద్యోగ, ఉపాధి వివరాలను కూడా ప్రభుత్వం నమోదు చేసుకోనుంది. ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి వివరాలు.. బిజినెస్ అయితే వార్షిక ఆదాయం, రోజువారి వేతన కార్మికులు అయితే ఆ రంగానికి సంబంధించి వివరాలను నమోదు చేసుకోనున్నారు. ఇక కుల వృత్తులు చేస్తున్నట్టయితే.. వాటికి సంబంధించిన వివరాలు కూడా సేకరించనున్నారు. వార్షిక ఆదాయం వివరాలు, పన్ను కడితే వాటికి సంబంధించిన సమచారం, బ్యాంక్ ఆకౌంట్ డిటెయిల్స్ కూడా తీసుకోనున్నారు.


వీటితో పాటు కుటుంబానికి ఉన్న భూముల వివరాలు కూడా ప్రభుత్వం సేకరించనుంది. ధరణి పాస్ బుక్ ఉన్నట్టయితే దాని నెంబర్, ఆ భూమిని ఏ రూపంలో పొందారు, భూమి ఏ రకం.. వ్యవసాయ భూమి అయితే దానికి సాగు నీటి వనరు ఏంటీ.. ఒకవేళ కౌలు భూమిలో పంట సాగు చేస్తున్నట్టయితే.. దానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించనున్నారు. దీంతో పాటు.. రిజర్వేషన్‌, దానికి సంబంధించిన ప్రయోజనాలు ఇతర వివరాలు కూడా సేకరించనున్నారు. మరోవైపు.. ఆ కుటుంభ సభ్యులు రాజకీయ నేపథ్యం గురించి కూడా ప్రభుత్వం సేకరించనుంది. ఒకేవేళ కుటుంబంలో ఎవరైనా వలస కార్మికులు ఉంటే వాళ్లకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు నమోదు చేసుకోనున్నారు.


ఇక పార్టు-2లో కుటుంబానికి ఉన్న అప్పులు, ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు.. ఎక్కడి నుంచి పొందారు.. లాంటి వివరాలతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నారా..? పశుసంపద వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృహానికి సంబంధించిన వివరాలు, తాగునీటి వనరులు, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం లాంటి వివరాలను అధికారులు సేకరించనున్నట్టుగా.. విడుదల చేసిన ఫామ్ ద్వారా తెలుస్తోంది.


 అయితే.. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. నవంబర్ 6వ తేదీ నుంచి మొదలు కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు జీవో నెంబర్ 18ను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే చేయాలని ఫిబ్రవరి 4న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అసెంబ్లీ ఆమోదించడంతో ఈ మేరకు అధికారులు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa