ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన ట్రైన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 10:14 PM

సికింద్రాబాద్‌-శాలీమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ట్రైన్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్‌ స్టేషన్‌ సమీపంలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. సౌత్‌-ఈస్ట్రన్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా.. మరో పార్సిల్‌ వ్యాన్‌ అధికారులు వెల్లడించారు.


ఈ ప్రమాదంపై సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓం ప్రకాష్ చరణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం 5:31 గంటల సమయంలో సికింద్రాబాద్-శాలీమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు తెలిపారు. 'మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతున్న సమయంలో ఒక పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికి తీవ్ర గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. ప్రయాణికులకు అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికులను చేరవేసేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశాం.' అని చరణ్ వెల్లడించారు.


ఇక రైల్వే ట్రాక్ పునరుద్ధరించే పనిలో రైల్వే సిబ్బంది నిమగ్నమైనట్లు చరణ్ చెప్పారు. వీలైనంత త్వరగా ట్రాక్‌లను క్లియర్ చేసి సాధారణ సర్వీసులను పునరుద్ధరిస్తామన్నారు. దాంతో పాటుగా పట్టాలు తప్పటానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


ఇక తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. డోర్నకల్ రైల్వే జంక్షన్ సమీపంలోని ఖమ్మం భద్రాచలం బైపాస్‎లో శుక్రవారం రాత్రి (నవంబర్ 8) గూడ్స్ పట్టాలు తప్పంది. దీంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని బోగీలు పట్టాల నుండి పక్కకు ఒరిగిపోయాయి. ప్రమాదానికి గురైన గూడ్స్ ట్రైన్ రైలు బొగ్గు లోడు కోసం భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.


రైల్వే అధికారులు, సిబ్బంది సహయక చర్యలు వేగవంతం చేశారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తీశారు. యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఈ రూట్‎లో ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa