ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి జ్యోతిదేవి కన్నుమూత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2024, 10:17 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. మెట్‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమొరెడ్డి జ్యోతిదేవి (70) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. న్యాయ విద్యనభ్యసించిన చదివిన జ్యోతిదేవిని మెట్‌పల్లి ప్రాంత ప్రజలు ప్రేమగా జ్యోతక్క అని పిలుస్తారు. జ్యోతిదేవి భర్త రాములు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. 1994లో తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేట ఎంపీటీసీగా విజయం సాధించారు. అనంతరం ఎంపీపీగా మండల ప్రజలకు సేవలందించారు.


 మెట్‌పల్లి ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1998లో ఎంపీగా విజయం సాధించగా.. అక్కడ ఉపఎన్నిక నివార్యమైంది. అప్పటికే ఎంపీపీగా కొనసాగుతున్న జ్యోతిదేవి ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీశారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిపై విజయం సాధించారు. సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఆమె ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీలో ఆందోళనలు చేసి ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ దృష్టిలో పడ్డారు. దీంతో జ్యోతిదేవిని ఆలిండియా మహిళా ఎమ్మెల్యేల అసోసియేషన్‌ నాయకురాలిగా సోనియా నియమించారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో ఆమె అనేక ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక 2004 ఎన్నిక‌ల్లో ఆమె భ‌ర్త కొమొరెడ్డి రాములు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.


జ్యోతిదేవి రాములు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కొమొరెడ్డి జ్యోతి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మలేషియా పర్యటనకు వెళుతూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జ్యోతి దేవి కుమారుడు కొమొరెడ్డి కరమ్‌కి మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. జ్యోతిదేవి మృతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలన్నారు. జ్యోతిదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.


కాగా, గతేడాది ఏప్రిల్‌లో జ్యోతిదేవి భర్త, మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రాములు సైతం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో ఆయన తనువు చాలించారు. రాములు మెట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా 2004లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమొరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa