రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అయితే.. మొదట్లో ప్రజల్లో ఉన్న అనుమానాలతో అక్కడక్కడా చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో సర్వే దూసుకెళ్తోంది. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం (నవంబర్ 22)తో కీలక మైలురాయి దాటింది. నవంబర్ 06 వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా.. ఇప్పటి వరకు 16 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా.. ఇప్పటివరకు కోటి కుటుంబాల గణనను ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయినట్టు సమాచారం. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్ జిల్లాల్లో 99.9 శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తయినట్టు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లాలో 98.5 శాతం పూర్తికాగా.. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో.. గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే కాస్త నెమ్మదిగా సాగుతోందని అధికారులు చెప్తున్నారు. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, తాళాలు వేసి ఉన్న ఇండ్లను మినహాయిస్తే.. మిగిలిన అన్ని కుటుంబాల సర్వే వంద శాతం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు.
మొదట్లో ఎన్నో అనుమానాలు, అపోహాలు.. వ్యక్తమైనప్పటికీ కుల గణనతోనే సామాజిక సాధికారత, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వే ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలకు ప్రజలకు వివరిస్తుండటంతో.. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాలుపంచుకుంటున్నారు.
రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లుగా సర్కార్ గుర్తించింది. నవంబర్ 06 నుంచి 08వ తేదీ వరకు ఇండ్ల గణన చేపట్టగా.. నవంబర్ 9వ తేదీ నుంచి అసలు కుల గణన సర్వేను సర్కార్ ప్రారంభించింది. మొత్తం1,16,14,349 కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 కుటుంబాలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నాయని సర్వేలో లెక్క తేలింది. ఈ సర్వే కోసం మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa