ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు ఎగిరిగంతేసే వార్త.. ఖాతాల్లోకి డబ్బు జమ, చెక్ చేస్కోండి.. ఒక్కొక్కరి అకౌంట్లలోకి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 11:06 PM

రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేస్తోంది. ఇప్పటికే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు కూడా ఇస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం.. శనివారం (నవంబర్ 16న) నిధులు విడుదల చేయగా.. వరుసగా ఒక్కొక్కరి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు జమవుతున్నాయి. బోనస్ డబ్బులు జమైనట్టుగా మొబైల్‌కు వచ్చిన మెస్సేజ్ చూసి.. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పటివరకు సన్న వడ్లకు సంబంధించి రూ.80 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు సమాచారం.


తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతంలో కొందరు రైతులు సన్నరకం వడ్లు పండిచగా.. వాటిని అమ్మటంతో క్వింటాకు రూ.500 చొప్పున అకౌంట్లలో బోనస్ డబ్బులు జమయ్యాయి. మొత్తంగా 46 క్వింటాళ్ల 80 కిలోల సన్నవడ్లు అమ్మిన ఓ రైతుకు తన ఖాతాలో బోనస్ డబ్బులు రూ.23,400 జమయ్యాయి.


మరోవైపు.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం హాతియా తండాకు చెందిన బాదావత్ నరేశ్ అనే రైతు.. తన మూడెకరాల్లో సన్నాలు వేయగా.. మంచి దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ఐకేపీ సెంటర్‌కు తీసుకొచ్చి కాంటా వేయగా.. 59 క్వింటాళ్ల 20 కేజీలు అయ్యాయి. కాంటా వేసిన మూడు రోజులతు.. తన అకౌంట్‌లో లక్షా 37 వేల 344 రూపాయలు జమయ్యాయి. వడ్లకు కనీస మద్దతు ధర రూ.2320 చొప్పున చెల్లించగా.. బోనస్ డబ్బులు రూ.29,600 జమైనట్టు నరేష్ తెలిపాడు. తనకు వచ్చిన కనీస మద్దతు ధరతో సంతృప్తి వ్యక్తం చేసిన నరేష్.. పైనుంచి బోనస్ డబ్బులు కూడా పడటంతో.. సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.


అయితే.. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగయినట్టు లెక్కలు చెప్తోంది ప్రభుత్వం. అందులోనూ సన్నాలే ఎక్కువగా పండించినట్టు సమాచారం. పోయిన వానాకాలంలో మొత్తం వరి సాగు విస్తీర్ణంలో కేవలం 25.05 లక్షల ఎకరాలు అంటే 38 శాతం మాత్రమే సన్నాలు సాగు చేయగా.. ఈసారి 40.44 లక్షల ఎకరాల్లో అంటే 61 శాతం సన్నాలు సాగు చేసినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. పోయిన వానాకాలంలో 40.89 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేయగా.. ఈసారి కేవలం 26.33 లక్షల ఎకరాల్లోనే సాగు చేసినట్టు చెప్తోంది.


ఈ ఏడాది సన్నవడ్ల దిగుబడి దాదాపు 93.33 లక్షల టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 ఐకేపీ సెంటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ డబ్బులు కూడా ఇస్తుండటం.. అది కూడా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నేరుగా ఖాతాల్లోనే ప్రభుత్వం డబ్బు జమ చేస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ధాన్యం కొనుగోలు వివరాలు..


కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు - 15.19 లక్షల మెట్రిక్ టన్నులు


కొనుగోలు చేసిన సన్న వడ్లు - 5.14 లక్షల మెట్రిక్ టన్నులు


ఇప్పటి వరకు కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం - 20.33 లక్షల మెట్రిక్ టన్నులు


దోడ్డు వడ్లు అమ్మిన రైతులు - 2,47,800


సన్న వడ్లు అమ్మిన రైతులు - 70,357


ధాన్యాన్ని విక్రయించిన మొత్తం రైతుల సంఖ్య - 3,18,157


రైతులకు చెల్లించిన మొత్తం - రూ.2760.22 కోట్లు


సన్నాలకు రూ.500 బోనస్ చెల్లించిన మొత్తం - రూ.80.17 కోట్లు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa