ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఈసారి పక్కా.. 6 స్థానాలకు గానూ తెరపైకి 10 మంది పేర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 07:28 PM

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు.. కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 07తో ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో.. కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయలేదు. అయితే.. ఈసారి మాత్రం కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. డిసెంబర్ 09వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి.


మహారాష్ట్ర ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తుండగా.. ఈరోజు రిజల్ట్ రానే వచ్చింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా మాత్రం ఫలితాలు రాలేదు. మరాఠా గడ్డపై కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారీ ఓటమి ఎదురైంది. స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం నిర్వహించగా.. ఆయన ప్రచారం నిర్వహించిన అన్ని చోట్లలో కాంగ్రెస్‌కు భారీ స్థాయిలో ఓడిపోవటం గమనార్హం. మరి.. ఈ మహా ఓటమితో కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణను ఏమైనా వాయిదా వేస్తుందా.. లేక ముందుగా అనుకున్నట్టుగానే కేబినెట్‌ను విస్తరించనుందా అన్నది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


మరోవైపు.. మంత్రి వర్గంలో మరో 6 స్థానాలకు అవకాశం ఉండగా.. ప్రధానంగా 10 మంది నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కేబినెట్ విస్తరణ అనే అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా.. ఈ 10 మంది నాయకుల పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఉన్న కేబినెట్‌లో.. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో.. ఆ ప్రాంతాల నాయకులకే ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


మరోవైపు.. ఈ కేబినెట్ విస్తరణలో మైనారిటీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు యువతకు కూడా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో.. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఓ స్థానాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. అయితే.. కేబినెట్ విస్తరణతో పాటు కొన్ని ప్రముఖ శాఖల్లో మార్పు కూడా ఉండనుందని తెలుస్తోంది.


అయితే.. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, గడ్డం సోదరుల పేర్లు వినిపిస్తుండగా.. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మహబూబ్‌నగర్ మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి పేర్లు చర్చకు వస్తుండగా.. ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక.. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఓ బెర్తు కన్ఫామ్ అని చర్చ సాగుతోంది.


మరి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి వర్గంలో గడ్డం, కోమటిరెడ్డి సోదరులకు రెండు రెండు బెర్తులు ఇస్తారా.. ఇస్తే పార్టీ శ్రేణుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి.. సీఎం రేవంత్ రెడ్డి తన జట్టులోకి మరో ఆరుగురు మంత్రులుగా ఎవరెవరిని సెలెక్ట్ చేయనున్నారు.. అధిష్ఠానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందన్నది..!







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa