ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌‌లో అండర్‌ గ్రౌండ్ మెట్రో, 20 స్టేషన్లు.. ఆ రూట్‌లో డబుల్ డెక్కర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 07:18 PM

విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణను చేపట్టింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్కార్.. మొత్తంగా ఆరు కారిడార్లతో 116.4 కిలో మీటర్ల విస్తరించేందుకు ఇప్పటికే ప్రణాళిక రచించారు. ఇప్పటికే ఐదు కారిడార్ల డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఐదు కొత్త కారిడర్లలో నాగోల్- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రాయదుర్గ్- కోకాపేట్, ఎంజీబీఎస్‌-చంద్రాయణగుట్ట, మియాపూర్- పటాన్‌చెరు, ఎల్బీనగర్‌- హయత్‌నగర్ మార్గాల్లో మెట్రో విస్తరణ చేపడుతున్న విషయం తెలసిందే.


కాగా.. మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు అవకాశం ఉన్న చోట డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంపైనే అందరి దృష్టి ఉంది. ఈ మార్గంలో మొదట 24 స్టేషన్లు నిర్మించాలనుకున్న సర్కార్.. ఇప్పుడు 4 స్టేషన్లు తగ్గించి 20 మెట్రో స్టేషన్లు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే.. ఈ మార్గంలోనే ఎయిర్‌పోర్టు సమీపంలో 1.06 కిలో మీటర్ల మేర అండర్‌ గ్రౌండ్ మెట్రో మార్గం నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకు ఒకేలా ఉన్న మెట్రో.. రెండో దశలో ఓవైపు డబుల్ డెక్కర్, మరోవైపు అండర్ గ్రౌండ్ మెట్రోలతో ప్రయాణికులకు వినూత్న అనుభూతిని కల్పించేందుకు సిద్ధమవుతోంది.


ఇదిలా ఉంటే.. రెండో దశ మెట్రో విస్తరణపై హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండో దశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే.. పాతబస్తీలో సుమారు 1100 ఆస్తులు సేకరించాలన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టులో భూసేకరణకే పెద్ద ఎత్తున నిధులు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. రెండో దశలో ప్రతి కిలో మీటరుకు రూ.318 కోట్లు ఖర్చు అవుతుందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. అయితే.. రెండో దశలో నిర్మించే మెట్రో స్టేషన్ల పేర్ల విషయంలో ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.


మరోవైపు.. మెట్రో విస్తరణలో మతపరమైన ఏ నిర్మాణాలు కూల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ముంబయి, చెన్నై నగరాల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్‌ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని.. హైదరాబాద్‌లో విస్తరణ లేని కారణంగానే మూడో స్థానానికి పరిమితమయ్యామని తెలిపారు. రెండో దశ కూడా పూర్తయితే.. దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అయితే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలో పనులు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభం కానున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa