రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక.. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటుగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, చెన్నారావుపేట మండల కేంద్రంలో భూమి కంపించింది. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలోనూ స్వల్పంగా భూమి కంపించింది.
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో వణికిపోయిన జనం
ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉంది. భూకంప కేంద్రం నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలిపారు. 1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత తాజాగా.. ఆ తీవ్రతతోనే ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి లోపల పగుళ్లలో ఒత్తిడికి గురై.. స్థానచలనం జరిగటం ద్వారా ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు. హైదరాబాద్, ఏటూరు నాగారం, ములుగు, భద్రాచలం తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు.
ఉన్నట్లుండి భూమి కంపించటంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. హైదరాబద్ నగరంలో బుధవారం ఉదయం 7 గంటల సమయంలో భూకంపం సంభవించటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న తమ వాళ్లకు ఏమైందోనన్న కంగారుతో ఊళ్ల నుంచి కాల్స్ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని మణికొండ, బండ్లగూడ జాగీర్, కిస్మత్పూర్, అత్తాపూర్, నార్సింగి, రాజేంద్రనగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెంట్, ఎర్రగడ్డ, బోరబండ ఏరియాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే అవకాశం ఉందని భూగర్భ నిపుణులు చెప్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల వెంట ఫాల్ట్ లైన్ ఉంటుందన్నారు. GSI ప్రకారం ఈ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చే అవకాశం మధ్యస్థంగా ఉందని చెబుతున్నారు. 1969న భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని ఫాల్ట్ లైన్ కారణంగా 5.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందని వెల్లడించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa