నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘‘అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జులై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే హైడ్రా కూల్చదు. ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయి. అనుమతులు రద్దైనా నిర్మాణాలు జరుగుతుంటే అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తాం.
పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. మల్లంపేట కొత్వాల్ చెరువు, అమీన్పూర్లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలే. ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుంది. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం.. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోంది.లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తోంది. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు హైడ్రా పని చేస్తుంది. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టింది. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుంది. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది’’ అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa