ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యాపేటలో పరువు హత్య,,,కన్నీంటి పర్యంతమైన యువతి తల్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 08:31 PM

సూర్యాపేట పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వడ్లకొండ కృష్ణ అలియాస్‌ బంటి ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం ఉదయం పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై డెడ్ బాడీని గుర్తించారు. భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్న ఐదు నెలలకే కృష్ణను.. భార్గవి సోదరుడు నవీన్ ఇతరులతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ఈ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. నానమ్మ రెచ్చగొట్టడంతోనే నవీన్ ఈ హత్య చేశాడని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణను హత్య చేసిన తర్వాత.. డెడ్ బాడీని కార్లో వేసుకొని సూర్యాపేటలో బంధువుల ఇంట్లో ఉన్న నానమ్మకు చూపించారని.. ఆ తర్వాత నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి డెడ్ బాడీని చూపించారని.. నిందితులు డిక్కీలో మృతదేహం ఉంచుకొని రాత్రంతా కార్లో తిరిగారని మీడియాలో కథనాలు వచ్చాయి.


అయితే బంటి హత్య, ఈ కేసులో కుమారుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, భర్తను విచారణ నిమిత్తం పిలవడం లాంటి పరిణామాలతో భార్గవి తల్లి తల్లడిల్లిపోతున్నారు. ఇంత జరిగినా సరే తమ కుమార్తెను తమతోపాటు తీసుకొస్తామని ఆమె చెబుతున్నారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్ ప్రతినిధి.. ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులో ఉన్న బాధను బయటపెట్టారు.


కృష్ణను తమ కుమార్తె ప్రేమించిన విషయం తమకు తెలియదని భార్గవి తల్లి తెలిపారు. తమ కుమార్తెకు పెళ్లి చేయడం కోసం పోలీసు కానిస్టేబుల్ సంబంధం తీసుకొచ్చామని.. కట్నం కూడా మాట్లాడామని ఆమె చెప్పారు. పెళ్లి కుదిరిన తర్వాత భార్గవి తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లగా.. రెండు రోజులు సమయం ఇచ్చారని.. తామెంత బతిమిలాడినా భార్గవి తమ మాట వినలేదన్నారు. దీంతో ఎలా జరిగితే అలా జరుగుతుందని వదిలేశామని.. ఆ తర్వాత తమ ప్రేమ వివాహాన్ని అంగీకరించాలని భార్గవి స్నేహితుల ద్వారా తమతో చెప్పించేదన్నారు.


‘భార్గవి భర్తను నా కొడుకు నవీన్ హత్య చేసిన విషయం నాకు తెలియదు. బయటి వ్యక్తులు వచ్చి చెప్పే దాకా ఈ హత్య గురించి నాకు తెలియదు. ఈ హత్య జరగడం బాధ కలిగిస్తోంది. నా కూతురు ఇంటికి వచ్చేందుకు ఒప్పుకుంటే ఆమెను తీసుకొస్తాం’ అని భార్గవి తల్లి తెలిపారు.


అమ్మాయిలు తల్లిదండ్రులను కాదని.. ప్రేమించిన వ్యక్తులతో వెళ్లిపోవడం సరికాదన్న ఆమె.. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని అభ్యర్థించారు. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులు.. తమ బిడ్డ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని.. మంచి వ్యక్తితో ఇచ్చి పెళ్లి జరపించాలని అనుకుంటారు గానీ.. పిల్లల జీవితాన్ని పాడు చేద్దామని అనుకోరన్నారు. తల్లిదండ్రుల ఆవేదనను పిల్లలు అర్థం చేసుకోవాలని కోరారు.


కృష్ణ ఎవరో, ఏం చేస్తాడో తనకు తెలియదన్న ఆమె.. తన కొడుకు నవీన్ వ్యవసాయం చేస్తాడని తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చిన తన భర్తను తమతోపాటు తీసుకెళ్లారన్నారు. తమ కుమార్తె ఇంటికి వస్తానంటే తీసుకొస్తామన్నారు. ఎవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa