వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో కీలక మైలురాయికి చేరువైంది. తన శక్తివంతమైన ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన కొత్తతరం కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ను కక్ష్యలోకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈరోజు ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్డౌన్ ఇప్పటికే ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.ఈ ప్రయోగంలో 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగం జరిగిన 15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తిచేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇప్పటివరకు ఇస్రో సాధించిన 4,400 కిలోల పేలోడ్ ప్రయోగ రికార్డు ఈ ప్రయోగంతో బ్రేక్ కానుంది. బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం-3 రాకెట్ 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువుతో అత్యంత విశ్వసనీయ రాకెట్గా గుర్తింపు పొందింది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 సహా ఇప్పటివరకు చేపట్టిన ఎనిమిది ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కాగా, ఎల్వీఎం-3 ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య ప్రయోగమిది. గతంలో వన్వెబ్ సంస్థకు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి గర్వకారణంగా నిలవనుంది. భారీ అమెరికన్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత రాకెట్ మోసుకెళ్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం చూపంతా ఇప్పుడు ఇస్రోపైనే కేంద్రీకృతమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa