హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు గురించి తెలంగాణ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో భాగంగా జేబీఎస్ నుంచి ఫలక్నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణం పూర్తి కాలేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో మార్గంలో పాతబస్తీలో మెట్రో నిర్మించేందుకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రాజెక్టు డిజైన్లో కొన్ని మార్పులు చేసిన తర్వాత.. ప్రస్తుతం ఆ మార్గంలో మెట్రో రైలు విస్తరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ మార్గంలో మెట్రో విస్తరణపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. దీనిపై ఏపీడబ్ల్యూఎఫ్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ పిల్లో పిటిషనర్ పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాతబస్తీలో ఉన్న పలు చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ మెట్రో రైలు విస్తరణను చేపడుతున్నారని ఆ పిల్లో పేర్కొంది.
తెలంగాణ హెరిటేజ్ యాక్ట్-2017 ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న చారిత్రక కట్టడాలను కాపాడాల్సి ఉంటుందని ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఏపీడబ్ల్యూఎఫ్ తెలిపింది. పాతబస్తీలో నిర్మిస్తున్న మెట్రో మార్గం సమీపంలో ఉన్న చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణాహవేలీ, మొఘల్పుర సమాధుల వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది. మెట్రో రైలు విస్తరణ వల్ల ఆ చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోపించింది.
మెట్రో ప్రాజెక్టు డిజైన్ను తెలంగాణ హైకోర్టు లేదా సంబంధిత నిపుణుల బృందం చూసి.. పరిశీలించి ఆమోదించిన తర్వాత నిర్మాణంపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరింది. అప్పటివరకు పాతబస్తీలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనులు నిలిపివేయాలని హైకోర్టుకు ఏపీడబ్ల్యూఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఈ పిల్పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. దీనిపై తదుపరి విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa