ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ పీజీ మెడికల్ సీట్లలో ఏపీ విద్యార్థులు.. స్థానికత కోటాపై సుప్రీంకోర్టుకు రేవంత్ సర్కార్ అప్పీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 07:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మెడికల్ విద్యార్థులు.. స్థానికత కోటా కింద తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశం పొందేలా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన మెడికల్ విద్యార్థులకు మాత్రమే.. పీజీ మెడికల్ కాలేజీల్లో స్థానికత కోటా కింద ప్రవేశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన విజ్ఞప్తికి తెలంగాణ హైకోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ సుధాంశు దిలియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించగా.. తాము విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.


పీజీ మెడికల్‌ సీట్లలో స్థానికత కోటాపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం కోర్టు విచారణకు అంగీకరించింది. తెలంగాణ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు.. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడానికి ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.


 ఆర్టికల్ 371డీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో తెలంగాణలోని మెడికల్ కాలేజీలో సీట్లు కేటాయించాలని సుమారు 100 మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఆర్టికల్ 371డీ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా వర్తిస్తుందని తీర్పును వెలువరించింది. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్టికల్ 371డీని 10 ఏళ్ల పాటు మాత్రమే వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014లో ఉన్న నిబంధనను తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసినా.. ఆ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.


9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానిక కోటా వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. తెలంగాణలో చదివిన వారికి మాత్రమే ఈ స్థానికత కోటా వర్తిస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఆర్టికల్ 371డీ ప్రకారం రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారు కూడా తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా కింద అర్హులేనంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.


ఆర్టికల్ 371డీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వర్తిస్తున్నందు వల్ల దానిలో సవరణలు చేసేంత వరకూ ఆంధ్రా, రాయలసీమల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్ధులు కూడా తెలంగాణలో స్థానిక కోటా కింద పీజీ మెడికల్ సీట్లు పొందేందుకు అర్హులేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో సుమారు 200 మంది ఏపీ విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలోనే ఈ పీజీ మెడికల్ సీట్లలో ఏపీ విద్యార్థులకు స్థానికత కల్పిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com