ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత కర్కషంగా.. హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 05:59 PM

సమాజంలో మనుషుల మధ్య ఉండే సంబంధాలకు రోజురోజుకు విలువ తగ్గిపోతోంది. ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు అనురాగాలు వాట్సప్ స్టేటస్‌లకు మాత్రమే పరిమితమవుతూ.. రియాల్టీలో మాత్రం క్షణికావేశాలు, ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా.. జనాల్లో సైకోయిజం ఎక్కువైపోయి.. కన్నవారు, తోడబుట్టిన వారు, కట్టుకున్నవారు అని తేడా లేకుండా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. నవమాసాలు మోసి.. ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లినే ఏమాత్రం కనికరం లేకుండా కర్కశంగా కత్తితో పొడిచి చంపిన ఈ కసాయి కొడుకు ఘటన.. ఒళ్లంతా రక్తం పూసుకుంటూ నేరపూరితంగా మారిపోతున్న సమాజానికి అద్దం పడుతోంది.


సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డివినో విల్లాస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల క్రితం కార్తీక్ రెడ్డికి జన్మనిచ్చింది రాధిక. కానీ.. అప్పుడు ఆమెకు తెలియదు కదా.. ఆమె గర్భంలో పెరిగిన ఆ నలుసే.. 26 ఏళ్ల తర్వాత ఆమెకు మరణ శాసనం రాస్తాడని. అందరిలాగే అల్లారుముద్దుగా పెంచుకుంది. ఏ తల్లైనా బిడ్డను కంటుంది కానీ.. ఆ బిడ్డ బుద్ధిని కనలేదు కదా. ఇప్పుడు రాధికకు 52 ఏళ్లు. తనకు పుట్టిన బిడ్డ పెద్దయ్యాక ప్రయోజకుడవుతాడని కలలు కంటూ అడిగినదల్లా కొనిస్తూ లగ్జరీగా పెంచితే.. ఆ తల్లిదండ్రులు కన్న కలలకు భిన్నంగా మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసై సైకో కొడుకుగా తయారయ్యాడు.


అప్పులు చేశాడో, ఆశలకు పోయాడో తెలియదు కానీ.. ఆస్తి పంచివ్వాలని గొడవ మొదలెట్టాడు. ఎన్ని రోజులున్నా ఉన్న ఆస్తి మొత్తం కొడుకే కదా. కానీ.. ఆ కొడుకు ఉన్న పరిస్థితిలో పంచిస్తే మరింత విచ్చలవిడిగా తయారవుతాడని భావించిన తల్లిదండ్రులు కార్తీక్ మాటలను నిరాకరిస్తూ వస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా.. తను కోరుకున్నంత ఆస్తి తనకు కావాలని రోజూ రచ్చ చేస్తున్నాడు కార్తీక్.


ఎంత గొడవ చేసినా.. ఆస్తి పంచివ్వకపోయేసరికి తల్లిదండ్రలను శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పంచిన ప్రేమను పూర్తిగా మర్చిపోయాడు. ఆస్తి ఒక్కటే అతడి టార్గెట్. ఏం చేస్తే ఆస్తి తన సొంతమవుతుందని ఆలోచించి.. చివరికి ఓ ప్లాన్ వేశాడు. సోమవారం (మార్చి 02న) బ్రహ్మముహుర్తంలో తల్లిని చంపేయ్యాలని స్కెచ్ వేశాడు. తల్లితో మళ్లీ ఆస్తి కోసం గొడవ మొదలెట్టాడు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో పదునైన కత్తితో.. తల్లిని కర్కషంగా 8 సార్లు పొడిచాడు. రాధిక అరుపులు విన్న ఇరుగుపొరుగు వాళ్లు.. రక్తపు మడుగులో ఉన్న ఆమెను హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే రాధిక ప్రాణాలు విడిచింది.


రాధిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు నిందితుడు కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనకు ఆస్తి రాసివ్వలేదన్న కోపంతోనే తల్లిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో కార్తీక్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa