ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడ్డపారతో భూమి తవ్వుతుండగా అద్భుతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 07, 2025, 05:56 PM

జగిత్యాల జిల్లా బతికేపల్లి గ్రామంలో ఉపాధిహామీ పనుల సందర్భంగా పురాతన నాణేలు వెలుగు చూశాయి. రోజువారీ కూలీ పనుల కోసం పొద్దునే వెళ్లిన కూలీలు భూమిని తవ్వుతుండగా.. ఒక్కసారిగా గడ్డపారకు ఏదో తగిలింది. మొదట ఇది సాధారణ రాయి అని అనుకున్నారు.. కానీ మరింత లోతుగా తవ్వగానే వింత శబ్దం రావడంతో వారిలో ఆసక్తి పెరిగింది. కూలీలు ఆచితూచి మళ్లీ తవ్వగా.. వారి కళ్ల ముందు అద్భుత దృశ్యం కనిపించింది. ఏకంగా 20 పురాతన నాణేలు బయటపడ్డాయి.


నాణేలు కనిపించడంతో కూలీలు ఈ విషయాన్ని వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ముంజ మహేశ్వరికు తెలియజేశారు. ఆమె స్పందించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా.. ఆర్ఐ జమున ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలనలు ప్రారంభించారు. మొదట ఈ నాణేలపై ఉన్న భాష ఉర్దూగా అనిపించినా.. సుదీర్ఘ పరిశీలన అనంతరం అవి పర్షియన్ భాషలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. లభ్యమైన నాణేలను డీటీఓ కార్యాలయానికి తరలించి.. ప్రత్యేక అధ్యయనం చేపట్టారు.


గుప్త నిధులు దొరికాయని వార్త ఊరంతా పాకిపోయింది. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకొని నాణేలను చూడాలని ఉత్సాహం చూపారు. ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రవి కిరణ్ గ్రామానికి చేరుకుని.. ప్రజలకు అసలు విషయాన్ని వివరించారు. ఇది గుప్త నిధి కాదని, పురాతన నాణాలుగా గుర్తించారని స్పష్టంచేశారు. ప్రజలు అనవసర భయాందోళనకు గురి కాకూడదని.. అధికారుల ఆదేశాలను అనుసరించాలని సూచించారు. ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించగా.. పురాతన నాణేల గురించి మరింత అధ్యయనం చేసి.. అవి ఏ కాలానికి చెందినవో తేల్చేందుకు పురావస్తు శాఖ త్వరలో పరిశోధనలు చేపట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com