ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేద బాలికలు, కాలేజీ అమ్మాయిలే టార్గెట్..ట్రాప్ చేసి వ్యభిచారంలోకి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 08:32 PM

పేద కుటుంబాల బాలికలు, కాలేజీ అమ్మాయిలనే టార్గెట్‌గా చేసుకుని.. మాయమాటలతో ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపుతూ వారి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ గలీజ్ దందా నడిపిస్తున్న ఓ జంటను.. వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు తెలుసుకుని.. రెడ్ హ్యాండెడ్‍‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, డబ్బులు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.


కొద్ది రోజుల క్రితం దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ఒక మహిళ.. తల్లిదండ్రులు లేని ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. కాగా.. వరంగల్ నగరంలో ఇదే తరహాలో చాలా మంది అమాయక అమ్మాయిలను ట్రాప్ చేసి బిజినెస్ చేస్తున్నారు. ఇలా దందా చేస్తున్న ఇద్దరు దంపతులను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం (ఏప్రిల్ 05) రోజు రాత్రి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు, రూ.1500 నగదు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.


మామునూరు పీఎస్ పరిధిలోని గవిచర్ల రోడ్డు దగ్గర రాజీవ్, సునీత అనే దంపతులు కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపి వ్యభిచారంలోకి దింపుతున్నారు. రాజీవ్, సునీత దంపతులు వ్యభిచారం చేస్తున్నారని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో.. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో.. ఓ బాధితురాలిని వ్యభిచార గృహం నుంచి విడిపించారు. విటుడు వరంగల్ ఫోర్ట్‌లోని కాశీకుంటకు చెందిన వ్యక్తి పరారయ్యాడు. రాజీవ్, సునీత దంపతులను అరెస్ట్ చేసి మామునూరు పోలీసులకు అప్పగించారు.


రాజీవ్, సునీత దంపతులు వ్యభిచారం మీదే ఆధారపడి జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల ఉండే పేద కుటుంబాల అమ్మాయిలను, కాలేజీ స్టూడెంట్లను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.. గతంలో కూడా రాజీవ్, సునీత దంపతులు ఇదే పని చేస్తూ పోలీసులకు పట్టుబడినట్టు తెలిపారు.


గతేడాది అక్టోబర్ 29న కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక డిగ్రీ స్టూడెంట్‌కు డబ్బు ఆశ చూపి వరంగల్ తీసుకొచ్చారు. ఇక్కడ వ్యభిచారం చేయించాలని ప్లాన్ చేయగా, టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి వారిని పట్టుకున్నారు. ఆ తరువాత కరీంనగర్ జిల్లాకు చెందిన డిగ్రీ స్టూడెంట్‌ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రాజీవ్, సునీత దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


కొద్దిరోజులు జైలుకు వెళ్లి వచ్చిన రాజీవ్, సునీత దంపతులు మళ్లీ అదే పని మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని మళ్లీ అరెస్ట్ చేశారు. పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు సరిగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.


"ఇలా అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్ ను వ్యభిచార రొంపిలోకి దింపి, వారి జీవితాలు నాశనం చేస్తున్న గ్యాంగ్ లపై ఫోకస్ పెట్టాలని, పీడీ యాక్టులు పెట్టి మరోసారి ఈ దందా సాగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు." అని స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa