తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భీకరమైన ఎండలు, ఉక్కపోత, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. వడదెబ్బకు చాలా మంది పిట్టల్లా రాలిపోతున్న భయంకర పరిస్థితి నెలకొంది. ఓవైపు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ వెదర్ మ్యాన్ మరో హెచ్చరికను మోసుకొచ్చాడు.
మెదక్ పరిసర ప్రాంతాలైన సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రానున్న కొద్ది గంటల్లో భీకర వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశాడు. ఈరోజు (ఏప్రిల్ 25వ) సాయంత్రం నుంచే ఈ ప్రాంతాల్లో వాతావరణం వేగంగా మారుతోందని తెలుపగా.. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆయా చోట్ల వర్షం కూడా మొదలైనట్టు తెలుస్తోంది..
అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణం అస్థిరంగా మారడంతో.. రాబోయే రెండు గంటల్లో ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించాడు. ఇక హైదరాబాద్ నగరంలో.. సాయంత్రం 7 గంటల వరకు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అయితే.. మెదక్ ప్రాంతంలో కురిసే వర్షాల ప్రభావం హైదరాబాద్ మీద కూడా పడే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నాడు. రాత్రి వేళల్లో హైదరాబాద్లో కూడా బలమైన గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నాడు.
హైదరాబాద్, మెదక్ ప్రాంతాల ప్రజలు రాబోయే కొద్ది గంటల్లో వాతావరణంలో చోటుచేసుకునే భారీ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని,సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు చేసేవాళ్లు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa