ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లంతా సిగ్గుపడాలి: మంత్రి ఉత్తమ్ కుమార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 07:41 PM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన తుది నివేదిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నివేదికపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.


శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదికను చూసి బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్టు కట్టారు. మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మీరు అధికారంలో ఉండగానే కూలిపోయింది." అని ఆయన దుయ్యబట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నాయని, ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినవారు, చేయించినవారు రైతులకు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. "బీఆర్ఎస్ అబద్ధాలు, తప్పులపై బతకాలని అనుకుంటోంది, అది కుదరదు" అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


మరోవైపు.. ఎన్డీఎస్ఏ నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, ఎన్డీఏ నివేదిక అని ఆయన విమర్శించారు. "బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి రాసిన నివేదిక ఇది" అని ఆయన ఆరోపించారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ, మేడిగడ్డను చూడకుండానే, అక్కడ ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిందని ఆరోపించారు.


గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలి 141 మంది మరణిస్తే, బీహార్‌లో రోజూ బ్రిడ్జ్‌లు కూలుతున్నా ఎన్డీఎస్ఏ స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలి 60 రోజులు అయినా ఎన్డీఎస్ఏ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. "కేవలం బీఆర్ఎస్‌ను బద్నాం చేయడానికే ఈ రకమైన రిపోర్టు ఇచ్చారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు. ఎన్డీఎస్ఏ రిపోర్టు డిసెంబర్‌లో వస్తే, ఇప్పుడు సరిగ్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రెండు రోజుల ముందు బయటకు తీస్తున్నారు" అని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నివేదిక, దాని విశ్వసనీయతపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నివేదికపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa