ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..గ్రూప్-1 నియామకాలకు బ్రేక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 08:49 PM

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల నియామక ప్రక్రియకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు స్టే విధించగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై రేపు (ఏప్రిల్ 29) తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.


గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా.. 19 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు.. రెండు నిర్దిష్ట పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన కొందరు అభ్యర్థులు అధికంగా ఎంపికయ్యారని ఆరోపిస్తూ మరో 20 మంది అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.


ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. అయితే, తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.


రేపు జరగనున్న విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనుంది. టీజీపీఎస్సీ వాదనలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు స్టే ఎత్తివేస్తుందా లేదా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సమర్థిస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై వెలువడే తీర్పు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.


తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి.. గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాలకు 2023, జూన్‌ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అదే ఏడాది జులై 7న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం.. మెయిన్స్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలను 2024 అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల కాగా.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలను కూడా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa