ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్ అంటూ..ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కౌంటర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 07:19 PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధికారికంగా స్పందించింది. హరీష్‌రావును "ఆరడుగుల బుల్లెట్"గా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ తమ సామాజిక మాధ్యమాల ఖాతాలలో ఒక పోస్ట్ పెట్టడంతో ఈ విషయం మరింత చర్చకు వచ్చింది. ‘సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీశ్ రావు అంటూ తన ఎక్స్ ఖతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓ వీడియోను షేర్ చేశారు.


పార్టీ అంతర్గత పరిణామాలు..


ఈ వివాదం తర్వాత పార్టీలో పలు అంతర్గత మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నివాసానికి పలువురు కీలక నాయకులు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కేటీఆర్, మధుసూదనాచారీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వరరరెడ్డి వంటి ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారని సమాచారం. ఇది పార్టీ అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా భావిస్తున్నారు. అంతేకాకుండా.. పార్టీ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కవిత పీఆర్వోను తొలగించడం పార్టీలో ఆమె స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


ప్రస్తుత పరిణామాలు బీఆర్ఎస్లో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. గతంలో పార్టీలో ఇలాంటి విభేదాలు బయటకు రావడం చాలా అరుదు. అయితే.. అధికారం కోల్పోయిన తర్వాత నాయకుల మధ్య సమన్వయం తగ్గిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావు పార్టీకి ఒక కీలకమైన నాయకుడిగా.. క్షేత్ర స్థాయిలో బలమైన మద్దతుదారుడిగా పేరు పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పార్టీలో ఆయన పాత్ర చాలా కీలకం. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై వివిధ వర్గాలలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ కేంద్ర బిందువుగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు కీలక నేతలు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక.. హైదరాబాద్ నుంచి మరికొందరు శాసన సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఫామ్‌హౌస్‌కు బయలుదేరినట్లు తెలిసింది. కేసీఆర్‌తో జరిగిన చర్చల అనంతరం పార్టీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా. కవితపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా భవిష్యత్ వ్యూహరచనను బీఆర్ఎస్ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa